Nara Lokesh: ఓడిన చోటే గెలిచారు లోకేష్. ఓటమి ఎంత సంచలనం సృష్టించిందో.. ఇప్పుడు ఆయన గెలుపు సైతం అదే సంచలనంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు లోకేష్. మెజారిటీ పరంగా టాప్ త్రీ లో ఉన్నారు. అయితే ఆయన విజయం అంత ఆషామాషీగా దక్కలేదు. పోయిన చోటే వెతుక్కున్నారు లోకేష్. గత ఐదు సంవత్సరాలుగా పట్టు నిలుపుకునేందుకు మంగళగిరిలో ఆయన చేయని ప్రయత్నం లేదు. అందుకే అంతులేని మెజారిటీతో గెలవగలిగారు. ఇప్పటివరకు మంగళగిరి చరిత్రలో గెలిచిన వారంతా అత్తెసరు మెజారిటీతోనే. కానీ దాని రికార్డును బ్రేక్ చేశారు లోకేష్.
అయితే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వారితో మమేకమయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా దర్బారు నిర్వహించాలని నిర్ణయించారు. ఎప్పటికీ ప్రతిరోజు నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించడం ప్రారంభించారు. వాటికి పరిష్కార మార్గం చూపుతున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై దృష్టి పెట్టారు. తన నివాసానికి వచ్చి సమస్యలు చెప్పే వారి కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రజలు చెప్పుకునే బాధలను ఓపికగా వింటున్నారు. వాటికి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు.అయితే లోకేష్ ఈ తరహా ఆలోచనలకు రావడం అందరినీ విస్మయ పరుస్తోంది.
టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉంటూ మంగళగిరిలో పోటీ చేశారు లోకేష్. టిడిపి ఆవిర్భావం తర్వాత అక్కడ ఆ పార్టీ గెలిచింది చాలా తక్కువ. అటువంటి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని లోకేష్ సాహసమే చేశారు. కానీ ఓడిపోయారు. ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన తొలిసారి ఓటమి చవిచూశారు. దీంతో మంగళగిరిలో లోకేష్ పోటీ చేయరని అంతా భావించారు. కానీ గత ఐదు సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారు లోకేష్. వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరారు. దీనికి నియోజకవర్గ ప్రజలు సమ్మతించారు. ఏకపక్షంగా మద్దతు తెలిపారు. అందుకే తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు లోకేష్. అధికారంలోకి రాగానే ప్రజాదర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. లోకేష్ ఆలోచనలను అందరూ మెచ్చుకుంటున్నారు.