BJP YSRCP alliance: ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని కూటమి భావిస్తోంది. కేంద్ర పెద్దలతో సఖ్యతగా మెలుగుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్రం కూడా ఏపీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ కూటమి సైతం అంతే పట్టు కొనసాగిస్తోంది. మరో 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగాలని పవన్ కళ్యాణ్ బలంగా కోరుకుంటున్నారు. సీఎం చంద్రబాబు సైతం అదే అభిప్రాయంతో ఉన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో బిజెపితో వైసిపి పొత్తు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ తరహా ప్రచారం చేస్తున్నారు. అయితే అది సాధ్యమేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రారంభం నుంచి స్నేహ సంబంధాలు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే మాత్రం భారతీయ జనతా పార్టీతో మంచి స్నేహ సంబంధం కొనసాగిస్తూ వస్తోంది. విభిన్న సిద్ధాంతాలు కలిగిన ఆ రెండు పార్టీలు తెరవెనుక పరస్పర స్నేహం అందించుకున్న మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీని విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే బిజెపికి, కాంగ్రెస్ మధ్య వైరం ఉంది కాబట్టి.. సహజంగానే జగన్మోహన్ రెడ్డి విషయంలో బిజెపి స్నేహంగా ఉండకపోవచ్చు కానీ.. ఎటువంటి చెడు అభిప్రాయం ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే తరహా సిద్ధాంతాలు తో ముందుకు సాగింది. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు అధికం. అదే ఓటు బ్యాంకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళింది. కానీ ఈ ఓటు బ్యాంక్ అనేది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం. సిద్ధాంత పరంగా కూడా ఆ రెండు పార్టీలు విభిన్నం. అందుకే నేరుగా పొత్తు పెట్టుకోలేదు. గెలిచిన తర్వాత మాత్రమే పరస్పర రాజకీయ సహకారం అందించుకున్నాయి. అందుకే నేరుగా ఆ రెండు పార్టీలు కలిసే ప్రసక్తి ఉండదు అనేది మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయం.
Also Read: ఏకంగా 2.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ.. అందులో మీరు పేరుందో తెలుసుకోండి
ఆ రెండు పార్టీలు కలిస్తే సానుకూల ఫలితాలు..
దశాబ్దాల బిజెపి, టిడిపి చరిత్ర తీసుకుంటే ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన ప్రతిసారి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఎందుకంటే ఆ రెండు పార్టీల సిద్ధాంతాలు దగ్గరగా ఉంటాయి. ఆ రెండు పార్టీల శ్రేణులు వారి పొత్తును ఆశీర్వదించాయి కూడా. అయితే 2018లో వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా ఎన్డీఏ గుడ్ బై చెప్పారు చంద్రబాబు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి మరింత దగ్గరయ్యారు బిజెపికి. 2019 ఎన్నికల్లో ఎన్నికల నిర్వహణపరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిజెపి సహకరించింది. గెలిచిన వైయస్సార్ కాంగ్రెస్ ఐదేళ్లపాటు బిజెపికి ఐదేళ్లపాటు కేంద్రంలో రాజకీయ మద్దతు ఇచ్చింది. 2024 ఎన్నికల్లో అదే బిజెపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించి ఉండవచ్చు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజెపితో కలిస్తే తమ సంప్రదాయ మైనారిటీ, క్రిస్టియన్ ఓటు బ్యాంకు కోల్పోయే అవకాశం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదని వార్తలు కూడా వచ్చాయి. మరి అప్పుడు అలా వ్యవహరించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి బిజెపితో స్నేహం చేస్తారని ఎవరు అనుకోవడం లేదు.
వ్యూహంలో భాగంగా..
ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలో ఉంది. దూకుడు చూపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ వ్యూహంలో భాగంగా వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు అనే ప్రకటన చేసి ఉండవచ్చు. కూటమిలో విభేదాలకు అవకాశం కల్పించాలని అలా వ్యవహరించి ఉండవచ్చు. తాజాగా ఇదే అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధాలు లేవని తేల్చేశారు. జగన్మోహన్ రెడ్డి తప్పకుండా అరెస్ట్ అవుతారని కూడా తేల్చి చెప్పారు. తద్వారా వైసిపి విషయంలో బిజెపి అభిప్రాయం ఇది అని కుండ బద్దలు కొట్టారు.