Chintakayala Ayyannapatrudu: ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో నర్సీపట్నం ఒకటి. ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘకాలం ఆ నియోజకవర్గ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పని చేస్తూ వచ్చారు అయ్యన్నపాత్రుడు. కేవలం రెండుసార్లు మాత్రమే ఓటమి చవిచూశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి పదవి చేపడుతూ వచ్చారు. ఈసారి మాత్రం అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు వారసుడిపై బలమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే అయ్యన్నపాత్రుడు క్రియాశీలక రాజకీయాలకు దూరం అని ప్రకటించారు. దీంతో ఆయన వారసుడు ఎవరు అనే దానిపై విస్తృత చర్చ నడుస్తోంది.
* పెద్ద కుమారుడు విజయ్ రాజ్యసభకు..
ఇప్పటివరకు అయ్యన్నపాత్రుడి రాజకీయ వారసుడిగా కుమారుడు విజయ్ బరిలో దిగుతారని ప్రచారంలో ఉండేది. అందుకు తగ్గట్టుగానే గత పుష్కర కాలంగా ఆయన కుమారుడు విజయ్ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు పార్టీలో. అయితే మొన్ననే ఆయన రాజ్యసభకు ఎంపికై పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆరేళ్ల పాటు ఎంపీ పదవిలో కొనసాగుతారు. అందుకే వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం అసెంబ్లీ బరిలో విజయ్ దిగే అవకాశం లేదు. అలాగని చింతకాయల కుటుంబాన్ని కాదని వేరొకరు పోటీ చేయలేరు అక్కడ. ఈ తరుణంలో అక్కడ వచ్చే ఎన్నికల్లో పోటీకి రెండో కుమారుడు రాజేష్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నర్సీపట్నం నియోజకవర్గాన్ని వేరొకరికి ఇస్తే నెగ్గుకు రావడం కష్టం. అదే చింతకాయల కుటుంబం బరిలో దిగితే చాలా సులువుగా విజయం సొంతం చేసుకోవచ్చు అనేది చంద్రబాబు ఆలోచన. వచ్చే ఎన్నికల్లో అటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయ్.. ఇటు చింతకాయల అయ్యన్నపాత్రుడు సాయంతో టిడిపి అభ్యర్థిగా బరిలో దిగే రెండో కుమారుడు రాజేష్ ఈజీగా బయటపడతారన్న విశ్లేషణలు ఉన్నాయి.
* సుదీర్ఘ నేపథ్యం..
నర్సీపట్నం అనేది చింతకాయల కుటుంబానికి పెట్టని కోట. 1983 ఎన్నికల్లో తొలిసారిగా టిడిపి నుంచి పోటీ చేసి గెలిచారు అయ్యన్నపాత్రుడు. నాటి ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. 1985, 1989, 1994, 1999, 2004, 2014, 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గెలిచారు అయ్యన్న. 2009, 2019లో మాత్రం ఓడిపోయారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి పదవి దక్కించుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు పొలిటికల్ గా రిటైర్మెంట్ కావాలని సిద్ధపడుతున్నారు. ఇప్పటికే పెద్ద కుమారుడు ఎంపీగా రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా చిన్న కుమారుడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా ఎలా చూసుకున్నా అయ్యన్నపాత్రుడు రాజకీయంగా అదృష్టవంతుడే.

