Homeఆంధ్రప్రదేశ్‌TDP Janasena BJP Alliance: ఓడిపోయే సీట్లు ఇచ్చారంటన్న బిజెపి.. పొత్తులో పంచాయితీ

TDP Janasena BJP Alliance: ఓడిపోయే సీట్లు ఇచ్చారంటన్న బిజెపి.. పొత్తులో పంచాయితీ

TDP Janasena BJP Alliance: ఓడిపోయే సీట్లను బిజెపికి అప్పగించారా? బలమైన ప్రత్యర్థులు ఉన్నచోట సీట్లు కేటాయించారా? పొత్తు ధర్మం పాటించడం లేదా? కాషాయ దళంలో తీవ్ర అసంతృప్తి ఉందా? హై కమాండ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయా? అందుకే పురందేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. టిడిపి, బిజెపి,జనసేన మధ్య పుత్తు కుదిరిన సంగతి తెలిసిందే. సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం పూర్తయింది. కానీ ఏయే నియోజకవర్గాల్లో అన్నది స్పష్టత రావడం లేదు. బిజెపికి టిడిపి ప్రతిపాదించిన అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. కచ్చితంగా టిడిపి ఓడిపోతుందన్న నియోజకవర్గాలనే బిజెపికి కేటాయించారు అన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పొత్తులో భాగంగా బిజెపికి 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. కానీ బిజెపిలో ఆశావాహులు అధికంగా ఉన్నారు. మరికొన్ని సీట్లు అదనంగా అడగాలన్న యోచనలో బిజెపి ఉంది. కానీ టిడిపి మాత్రం అందుకు అంగీకరించడం లేదు. మరోవైపు ఇబ్బందికర నియోజకవర్గం బిజెపికి టిడిపి కేటాయించిందని ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ స్థానాల వరకు ఓకే అయినా.. అసెంబ్లీ సీట్ల విషయానికి వచ్చేసరికి బిజెపి సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాడేరు, అనపర్తి, ఆదోని వంటి నియోజకవర్గం బిజెపికి కేటాయించారు. అయితే అక్కడ సరైన క్యాడర్ లేదని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో టిడిపి గెలవలేదు కాబట్టే.. వాటిని తమకు కేటాయించారని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున హై కమాండ్ కు లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది. అందుకే కొన్ని సీట్ల విషయంలో చేర్పులు మార్పులు చేయాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

పొత్తులో సింహభాగం ప్రయోజనాలను తెలుగుదేశం పార్టీ పొందుతుందన్నది బిజెపి నేతల వాదన. అటు టికెట్ల ప్రతిపాదన సైతం బిజెపిలోని ప్రోటీడిపి నేతలకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పురందేశ్వరి సైతం టిడిపికి ఫేవర్ చేస్తున్నట్లు కొంతమంది సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. అటు చంద్రబాబు సైతం తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే బిజెపి నాయకులకు టిక్కెట్లు ఇవ్వొద్దని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహం, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలకు టికెట్లు లభించినా, లాభం చేసుకుని టిక్కెట్లు దక్కించుకున్నా.. టిడిపి సహకరించదన్న ప్రచారం కూడా ఉంది. అవసరమైతే పనిగట్టుకుని ఓడిస్తారని కూడా అనుమానాలు ఉన్నాయి. దీనిపై కూడా బిజెపి హై కమాండ్ కు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై చర్చించేందుకే పురందేశ్వరిని ఢిల్లీకి పిలిపించారని.. ఈరోజు సాయంత్రానికి బిజెపి సీట్ల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version