Volvo Plant AP: ఏపీ ప్రభుత్వానికి మరో గుడ్ న్యూస్ అందింది. ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం వాల్వో తన ఉత్పత్తి కేంద్రాన్ని ఏపీలో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వోల్వో ప్రతినిధులు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. రాష్ట్రంలో మరో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ తన కార్యకలాపాలను మొదలెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వాల్వో ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన కంపెనీ. అటువంటి కంపెనీ రాష్ట్రానికి వస్తే భారీ ఎత్తున అనుబంధ పరిశ్రమలు తరలివచ్చే అవకాశం ఉంది.
* తడలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్..
ఇప్పటికే చిత్తూరు జిల్లా తడలో రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. దాదాపు రూ.2500 కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ప్రపంచ బ్రాండ్ ఆటోమొబైల్ దిగ్గజం. మొన్ననే రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. దీంతో వేలాదిమందికి ఉపాధి కూడా దొరకనుంది. రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం కూడా సమకూరనుంది. విశాఖను ఐటి హబ్ గా.. రాయలసీమను తయారీ రంగ పరిశ్రమలకు హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యూహంతో పని చేస్తోంది. అది వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది.
* ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం..
ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజంగా వోల్వో ఉంది. ఈ కంపెనీ నుంచి అత్యాధునిక వాహనాలు ఉత్పత్తి అవుతుంటాయి. విడిభాగాల తయారీ కూడా జరుపుతూ ఉంటుంది ఈ సంస్థ. తమ నూతన కేంద్రాన్ని ఏపీలో పెట్టాలన్న ఆలోచన చేస్తోంది వాల్వో. రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ ఏర్పాటుతో ఈ వోల్వో ఆలోచనలో పడింది. తమ ఆసక్తిని ఏపీ ప్రభుత్వానికి చెప్పింది. 250 ఎకరాల భూమితో పాటు సింగిల్ విండో అనుమతులు, కొన్ని రకాల రాయితీలు కోరుతోంది. అయితే భారీ పెట్టుబడులకు అవకాశం ఉండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం సైతం అదే స్థాయిలో స్పందిస్తోంది. త్వరలో ఒప్పందాలు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
