New Pensions in AP : ఏపీలో కొత్త పింఛన్లు.వారే అర్హులు.. మార్గదర్శకాలు సిద్ధం!

కొత్త పింఛన్ల కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. అదే సమయంలో వైసీపీ హయాంలో అనర్హులకు ఇచ్చినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ తరుణంలో కొత్త పింఛన్ల మంజూరు తో పాటు అనర్హుల పింఛన్లను తొలగించనున్నట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : October 17, 2024 2:48 pm

New Pensions in AP

Follow us on

New Pensions in AP : ఏపీ ప్రభుత్వం సంక్షేమ పాలనకు ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా కీలక సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. అర్హత ఉండి పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే జనవరి నుంచి కొత్త పింఛన్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం అధికారులు సిద్ధం చేశారు. అయితే అదే సమయంలో అనార్హుల పెన్షన్లు కూడా తొలగించనున్నారు. వారికి పింఛన్లు రద్దు చేస్తూ.. అర్హత ఉన్నవారికి అమలు చేసే కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. తాము అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్నట్టుగానే పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచారు. ఏప్రిల్ నుంచి పాత బకాయిలతో సహా జూలైలో చెల్లించారు. అక్కడ నుంచి పెంచిన మొత్తాన్ని నెలనెలా అందిస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా అర్హత ఉన్న వారికి పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీనికి ముహూర్తంగా జనవరిని నిర్ణయించింది. దీంతో వేలాదిమంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. అదే సమయంలో అర్హత లేని వారి పింఛన్లు తొలగించనున్నారు.

* జన్మభూమి కార్యక్రమంలో
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి నుంచి జన్మభూమి 2 ప్రారంభించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అదే సమయంలో గ్రామ సభల్లో కొత్త పింఛన్ల పంపిణీ మొదలు పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ కొత్త పింఛన్ల పంపిణీకి సంబంధించి అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వం అనర్హులకు సైతం పింఛన్లు మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.గత నాలుగు నెలల టిడిపి కూటమి పాలనలో అనర్హుల పింఛన్ల అంశం తెరపైకి వచ్చింది. ఎక్కడికక్కడే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటన్నింటినీ పరిశీలించి తొలగించనున్నట్లు తెలుస్తోంది.

* మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులతో
వైసిపి ప్రభుత్వం కొత్త పెన్షన్ దరఖాస్తులను పక్కన పెట్టింది. తాము మరోసారి అధికారంలోకి వస్తే పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే అనూహ్యంగా ఆ పార్టీ ఓడిపోయింది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. కొత్త పింఛన్ల మంజూరు తో పాటు అనర్హుల ఏరివేత కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనుంది. అధికారులు ఇచ్చిన నివేదికపై ఈ ఉప సంఘం అధ్యయనం చేయనుంది. ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. మొత్తానికి అయితే ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో.. దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.