Deputy CM Pawan Kalyan : అలసితి.. సొలసితి.. తిరుమల మెట్లు ఎక్కలేక ఇంతట నీ శరణు సొచ్చితినీ

  పురాణ కాలంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అన్నమయ్య తీవ్రంగా కష్టాలు పడ్డాడు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరికి తన జీవితాన్ని స్వామివారి కోసం అర్పించాడు. అయితే సేమ్ అన్నమయ్య లాగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. చెమటలు కక్కుతూ.. కాళ్ల నొప్పులు భరిస్తూ మెట్లు ఎక్కారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Written By: Dharma, Updated On : October 1, 2024 10:16 pm

Pawan Kalyan

Follow us on

Deputy CM Pawan Kalyan : తిరుమలలో ఇటీవల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వాడుతున్నారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసిపి అన్నట్టుగా మొన్నటిదాకా వ్యవహారం సాగింది. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరును తప్పు పట్టగా.. దానికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి విమర్శలు సంధించారు. మొత్తంగా ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఈక్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వం తీరును తప్పు పట్టింది. చంద్రబాబు నాయుడు అలా తొందరపడి వ్యాఖ్యలు చేయాల్సి ఉండకూడదని అభిప్రాయపడింది. దీనివల్ల కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నది. ఇది సహజంగానే వైసిపికి బూస్ట్ లాగా పని చేసింది.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. చంద్రబాబును విమర్శించడం మొదలుపెట్టింది. వైసిపి అనుకూల మీడియాలో కథనాల మీద కథనాలను ప్రసారం చేయడం ప్రారంభించింది. అయితే ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు గానీ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఈ లడ్డు వ్యవహారాన్ని అంత సులభంగా వదిలిపెట్టేలా కనిపించడం లేదు. పైగా ఆయన ఇటీవల సనాతన ధర్మం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రకాష్ రాజ్ లాంటివాళ్ళు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధిస్తుండడంతో పవన్ కళ్యాణ్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. అంతేకాదు ఇటీవల విజయవాడలోని దుర్గ గుడి మెట్లను పవన్ కళ్యాణ్ శుభ్రం చేశారు. ఆయన దీక్ష కూడా చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు తాను కంకణ భద్దుడై ఉన్నానని పేర్కొన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ సోమవారం తిరుమల వెళ్లారు. కాలినడకన స్వామివారిని దర్శించుకునేందుకు మెట్ల మార్గం నుంచి బయలుదేరారు. ఇదే సమయంలో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మెట్లు ఎక్కలేక నరకం చేశారు. కొన్ని మెట్లు ఎక్కడం.. తర్వాత ఆగిపోవడం.. ఇలా సాగింది పవన్ కళ్యాణ్ కాలినడక యాత్ర. పవన్ కళ్యాణ్ చెమట చిందిస్తూ ఇబ్బంది పడుతుండడంతో భద్రత సిబ్బంది ఆయనకు సేవలు చేయడం మొదలుపెట్టారు. తీవ్రంగా చెమటలు వస్తున్న నేపథ్యంలో అట్టముక్కలను చింపి వింజామరలాగా ఊపడం ప్రారంభించారు.. అయితే దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది. ఈ వీడియోను వైసిపి అనుకూల సోషల్ మీడియా విభాగం ట్రోల్ చేస్తుండగా.. జనసేన అనుకూల సోషల్ మీడియా విభాగం మాత్రం తెగ ప్రచారం చేస్తోంది. అయితే బుధవారం వెంకటేశ్వర స్వామిని పవన్ కళ్యాణ్ ఉదయం దర్శించుకుంటారు. ఆ తర్వాత స్వామివారి సేవలో నిమగ్నమవుతారు. ఈ సందర్భంగా పలువురు ధర్మ ప్రచారకులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు.