AP Budget 2026: ఏపీలో( Andhra Pradesh) నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరికొద్ది సమయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో బడ్జెట్. దాదాపు రూ.3.46 లక్షల కోట్ల అంచనాతో ఈ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఉదయం 10:30 గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న క్యాబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. అనంతరం ఉదయం 10:15 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అటు తరువాత వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు వ్యవసాయ బడ్జెట్ సమర్పిస్తారు. మరోవైపు శాసనమండలిలో బడ్జెట్ను హోంమంత్రి అనిత,, వ్యవసాయ బడ్జెట్ను రెవెన్యూ శాఖ మంత్రి సత్య ప్రసాద్. ఆ తర్వాత ఉభయ సభలు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. తిరిగి ఈనెల 17న సభ ప్రారంభం కానుంది.
* గత ఏడాది కంటే పెరుగుదల..
గత వార్షిక బడ్జెట్ రూ. 3,22,359 కోట్లు కాగా.. ఈసారి బడ్జెట్ రూ.3.46 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా సూపర్ సిక్స్( Super 6 ) పథకాల్లో భాగంగా అధికంగా ఈసారి కేటాయింపులు ఉండనున్నాయి. పోలవరం, అమరావతి, రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలతో కలిపి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో మూడు ఆర్థిక జోన్లకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించనున్నారు. మరోవైపు 16వ ఆర్థిక సంఘం గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కు మరికొన్ని నిధులు ఇవ్వాలని సిఫారసు చేసింది. అందుకే కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా కూడా పెరగనుంది.
* కేంద్రం నుంచి నిధులు..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అక్కడి బడ్జెట్కు అనుగుణంగా రాష్ట్రానికి వివిధ పథకాల నుంచి నిధులు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది జనవరిలో నాలుగు శాతం అదనంగా ఏపీకి రాబడి వచ్చింది. ఈసారి బడ్జెట్లో పోలవరం, అమరావతికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు దాదాపు 35 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఆ మేరకు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. సంక్షేమ పథకాలకు సైతం ఎనలేని ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది.