AP Assembly Election Results 2024
AP Assembly Election Results 2024: రాయలసీమలోను టిడిపి ప్రభంజనం కొనసాగింది. చివరకు జగన్ అడ్డా కడపలో సైతం మెజారిటీ స్థానాల దిశగా కూటమి ముందుకెళ్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి రాయలసీమ వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో సైతం ఆ పార్టీదే విజయం. 2019 ఎన్నికల్లో 52 స్థానాలకు గాను 49 స్థానాల్లో వైసిపి విజయం సాధించింది. కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ మాత్రమే గెలుపొందారు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. కూటమి ప్రభంజనానికి రాయలసీమలో ఫ్యాన్ రెక్కలు విడిచింది. కేవలం కడపలోని పులివెందుల, బద్వేలు, రాయచోటిలో మాత్రమే ఆ పార్టీముందంజలో నిలిచింది.
రాయలసీమలో చంద్రబాబును ఓడిస్తామని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ బాధ్యతను సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. అటు హిందూపురంలో బాలకృష్ణను సైతం ఓడిస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు ను వదిలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రెండు నియోజకవర్గాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ కుప్పం నుంచి చంద్రబాబు గెలుపు బాటలో ఉన్నారు. హిందూపురం నుంచి బాలకృష్ణ కూడా గెలవనున్నారు. ఎటొచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి బాటలో ఉండడం గమనార్హం.
వాస్తవానికి రాయలసీమ అంటేనే వైసిపి.. వైసిపి అంటేనే రాయలసీమ అన్నంత పరిస్థితి ఉండేది. 2014 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా ఆంధ్రాలో టిడిపి స్పష్టమైన మెజారిటీ దక్కించుకున్నా.. రాయలసీమ విషయానికి వచ్చేసరికి చతికిల పడింది. మెజారిటీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. 2019లో అయితే క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి కూడా రాయలసీమలో అత్యధిక స్థానాలు గెలుచుకొని.. మిగతా ప్రాంతాల్లో గెలిచే స్థానాలతో మ్యాజిక్ ఫిగర్ దాటుతానని అంచనా వేసింది. కానీ ఆ అంచనాలు తప్పాయి. రాయలసీమలో సీన్ రివర్స్ అయ్యింది. వైసీపీకి దారుణ ఓటమి మిగిలింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ap assembly election results 2024 in rayalaseema ycp suffered a heavy defeat
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com