AP Panchayat Elections: ఏపీలో( Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. వేసవిలో పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. వరుసగా స్థానిక సంస్థలకు సంబంధించి పాలకవర్గాల గడువు ముగియనుంది. దీంతో ప్రత్యేక అధికారులను నియమిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మున్సిపల్ పాలకవర్గాల గడువు ఈనెల 17 తో ముగియనుంది. దీంతో నగరపాలక సంస్థలకు కలెక్టర్లను, మున్సిపాలిటీలకు ఆర్డిఓ లను ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఏప్రిల్ 2తో పంచాయితీల పాలకవర్గాల గడువు ముగియనుంది. పంచాయితీలకు సైతం ప్రత్యేక అధికారులు రానున్నారు. వచ్చే ఖరీఫ్ అంటే జూన్ నాటికి స్థానిక సంస్థల ఎన్నికల పూర్తి చేసి కొత్త పాలకవర్గాలు తేవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?
* నేతల ఎదురుచూపు.. తెలుగుదేశం( Telugu Desam) పార్టీ కూటమి స్థానిక నేతలకు సంబంధించి ఎదురుచూస్తున్నారు పదవుల కోసం. ముఖ్యంగా పంచాయితీలు తెలుగుదేశం పార్టీ నేతలకు దూరమై దాదాపు 13 సంవత్సరాలు అవుతోంది. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కాంగ్రెస్ సానుభూతిపరులు ఎక్కువగా గెలిచారు. రాష్ట్ర విభజన తరువాత.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో వారంతా ఆ పార్టీలో చేరారు. వారి పదవీకాలం గడువు 2018తో ముగిసింది. అప్పట్లో టిడిపి ప్రభుత్వం ఉండగా ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో టిడిపి నేతలకు ఛాన్స్ లేకుండా పోయింది. 2021 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం వైసీపీ నేతలు ఏకపక్షంగా పంచాయితీలను గెలుచుకున్నారు. మండల జిల్లా పరిషత్తులతో పాటు మున్సిపాలిటీల్లో కూడా పరిస్థితి అదే. అందుకే టిడిపి శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల కోసం.
* వేసవిలోనే..
వాస్తవానికి మార్చిలోగా( March) స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు, పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా వెనుకడుగు వేసినట్లు కనిపిస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం పూర్తయింది. ఆరు నెలలు లేదా కొత్త ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యే వరకు ఈ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. ఇటీవల అనంతపురం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో వేసవి సెలవుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేసి పాలనపై దృష్టి పెట్టాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం.
* కొత్త ఎన్నికల అధికారి..
ప్రస్తుతం ఎన్నికల ప్రధాన అధికారిగా నీలం సాహ్ని( Neelam Sahni ) ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఆమె నియమితులయ్యారు. అంతకుముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండేవారు. స్థానిక ఎన్నికల నిర్వహణ తర్వాత ఆయన పదవీ విరమణ పొందారు. అటు తరువాత నీలం సాహ్నిని నియమించారు. మార్చి 31న ఆమె పదవి విరమణ చేస్తారు. ఆమె స్థానంలో కొత్త అధికారి నియామకం కోసం ముగ్గురు పేర్లతో గవర్నర్ కు పంపింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు ఓటరు జాబితా సవరణ, బీసీ రిజర్వేషన్ల కోసం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక ఏప్రిల్ లో రానుంది. ఇవన్నీ పూర్తయ్యాక ముందుగా పంచాయతీలకు.. తరువాత మున్సిపాలిటీలకు.. చివరకు మండల జిల్లా పరిషత్తులకు ఎన్నికల నిర్వహణ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..