Amaravati Capital Development: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2028 నాటికి ఒక రూపం తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ మంత్రి నారాయణ చూస్తున్నారు. మొన్న మధ్యన పనుల్లో జాప్యంపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. దీంతో ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో నిర్మాణ సంస్థలు పనులను వేగవంతం చేశాయి. ఇంకోవైపు ప్రైవేటు భవనాలకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఊపందుకుంటున్నాయి. నిన్ననే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు నందమూరి బాలకృష్ణ. అహోరాత్రులు వేలాదిమంది ఇంజనీరింగ్ నిపుణులు, భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారు. రాత్రీ,పగలూ తేడా లేకుండా భారీ యంత్రాలతో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటువంటి సమయంలో అమరావతి వ్యతిరేక వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు.
* పేలని మావిగన్
ఇటీవల జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ మావిగన్ అనే పేరు పెట్టాలన్న ప్రతిపాదన చేశారు. అయితే అది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణం అయ్యింది. ఒకరిద్దరూ వైసీపీ నేతలు తప్ప మిగతావారు సైతం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు అర్థమవుతుంది. మరోవైపు అమరావతికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీజిల్ తరలిస్తున్నారు అంటూ సాక్షిలో కథనాలు వచ్చాయి. అందుకే రాష్ట్రంలో డీజిల్ కొరత ఏర్పడిందని చెబుతోంది సాక్షి మీడియా. అదే సాక్షి అమరావతిలో ఎటువంటి నిర్మాణాలు జరగలేదని కథనాలు రాస్తోంది. ఇప్పుడు చురుగ్గా పనులు జరుగుతున్న దృష్ట్యా డీజిల్ తరలిస్తున్నారని అదే సాక్షి చెప్పడాన్ని ప్రజలు విశ్వసించడం లేదు.
* సాక్షి లో కథనాలు..
తాజాగా అమరావతిలో అవినీతిపై సాక్షి( Sakshi) ప్రత్యేక కథనాలను ప్రచురిస్తోంది. అయితే దీనిని పట్టించుకునే స్థితిలో లేరు ప్రజలు. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అనే ముద్రను బలంగా చాటుకుంది. అమరావతి రైతుల వ్యతిరేకిస్తున్నారు ఆ పార్టీని .. కూటమి పార్టీలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. చివరకు తటస్థులతో పాటు సామాన్యులు సైతం అదే భావనతో ఉన్నారు. ఇప్పుడు సాక్షి వ్యతిరేక కథనాలు వస్తుండడంతో వైసిపి పై అమరావతి వ్యతిరేకముద్ర పెరుగుతోంది. మళ్లీ జగన్ వస్తే అమరావతిని మార్చేయడం ఖాయమన్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. అవినీతి జరిగిన సరే అమరావతి కొనసాగాలి అనేది సామాన్యుడి అభిమతం. మరోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిపోతుందన్న భయంతో.. ఎటువంటి వ్యతిరేక ప్రచారాన్ని పట్టించుకోవడం లేదు. అందుకే సాక్షి మీడియా ప్రచారం ఒట్టి వృధా ప్రయత్నం.