Jagan: మాజీ సీఎం జగన్ దూకుడుగా ఉన్నారు. పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన నిరాశ అలుముకుంది. జగన్ సైతం ఈ ఓటమిని భరించలేకపోయారు. కొద్దిరోజులపాటు సైలెంట్ అయ్యారు. మరోవైపు జగన్ కు అత్యంత నమ్మకస్తులు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్నవారు వీడుతున్నారు. అయితే ఇటువంటి సమయంలోనే జగన్ ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు. 2029 నాటికి పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. అటు పార్టీలోను సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో నూతన నియామకాలు చేపడుతున్నారు.తన విధేయులకు రీజనల్ బాధ్యతలు అప్పగిస్తున్నారు.మరోవైపు నియోజకవర్గాల బాధ్యులను సైతం మార్చారు.కొత్తవారిని నియమించారు.అయితే పార్టీ బాధ్యతలను తీసుకునేందుకు కొందరు విముఖత చూపుతున్నారు. ఈ తరుణంలో తనను నమ్ముకున్న వారికి మాత్రమే బాధ్యతలు అప్పగించుతున్నారు జగన్.
* కీలక నేతలకు బాధ్యతలు
తాజాగా ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ బాధ్యతల నుంచి సుబ్బారెడ్డిని తప్పించారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన విజయసాయిరెడ్డిని తిరిగి విశాఖ రీజినల్ బాధ్యతలు కేటాయించారు. సీనియర్లకు సైతంకీలక బాధ్యతలు ఇచ్చారు.ఇప్పటివరకు గోదావరి జిల్లాలకు ఇన్చార్జిగా ఉన్న మిథున్ రెడ్డికి గుంటూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలు కేటాయించారు. అలాగే చిత్తూరు, నెల్లూరు జిల్లాల బాధ్యతలను సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. బొత్స సత్యనారాయణకు సైతం కీలక బాధ్యతలు కట్టబెట్టారు. ఉభయగోదావరి జిల్లాల రీజనల్ ఇన్చార్జిగా నియమించారు. కృష్ణాజిల్లాను రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి కేటాయించారు.
* వైవి స్థానంలో విజయసాయిరెడ్డి
జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్చార్జిగా ఉండేవారు. గతంలో విజయసాయిరెడ్డి ఆ బాధ్యతలు చూసుకునేవారు. ఆయన స్థానంలో వైవి సుబ్బారెడ్డి కి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు సుబ్బారెడ్డిని తప్పించి తిరిగి విజయసాయిరెడ్డికి అప్పగించడం విశేషం. వై వి సుబ్బారెడ్డి ని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల బాధ్యతలను కేటాయించారు. ఇలా పార్టీని ప్రక్షాళన చేస్తూ సీనియర్ల సేవలను వినియోగించుకుంటున్నారు జగన్. మరి పార్టీ ఎంతవరకు బలోపేతం అవుతుందో చూడాలి.