Pawan Kalyan: జనసైనికులు, పవన్ అభిమానుల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. వారిలో జోష్ నెలకొంది. తమ అభిమాన నేత ప్రజా ప్రతినిధిగా చట్టసభల్లో అడుగుపెట్టనున్నారు. అది తలచుకుని అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. జనసేన ఏర్పాటు చేసి సుదీర్ఘకాలం అవుతోంది. కానీ పవన్ కు మాత్రం ఇంతవరకు సరైన విజయం దక్కలేదు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన నైరాశ్యం ఉంది. ఈసారి గెలుపుతో పార్టీ శ్రేణులకు, అభిమానులకు ఒక బూస్టింగ్ లభించే అవకాశం మాత్రం కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు పవన్. భీమవరం తో పాటు గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు. అది మొదలు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు పడుతూనే వస్తున్నారు. వైసీపీ కిందిస్థాయి నాయకుడు నుంచి సీఎం వరకు ఓడిపోయారు, ఫెయిల్యూర్ నాయకుడు అంటూ ఎన్నో రకాల ఆరోపణలు ఎదుర్కొన్నారు.ఓపికతో వ్యవహరించారు. వ్యూహాత్మకంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.గట్టిగానే పోరాటం చేశారు. విజయం అంచున నిలబడ్డారు. గెలుపు పక్కా అని.. మెజారిటీయే కీలకమని జనసైనికులు ధీమాతో ఉన్నారు.
ఒక్క పవన్ కళ్యాణే కాదు జనసేన తరఫున పోటీ చేసిన 21 మందిలో.. సగానికి పైగా గెలుస్తారని.. మిగతా స్థానాల్లో సైతం ఎడ్జ్ ఉందని ఒక అంచనాలు ఉన్నాయి. ఇది సహజంగానే జనసైనికులకు ఆనందం కలిగించే విషయం.పది సంవత్సరాలుగా ఎదురుచూపులు ఫలించనున్నాయి. ఆ క్షణం కోసం జనసైనికులు ఆనందంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ అంటూ స్టిక్కర్లు కూడా దర్శనమిస్తున్నాయి. కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ముందుగా ఎమ్మెల్యేగా పవన్ ను చూస్తే ఆ ఆనందమే వేరని జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఓడిపోయాడు ఓడిపోయాడు అన్న కామెంట్స్ కు గట్టిగా బదులు చెప్పవచ్చని భావిస్తున్నారు. మొత్తానికైతే జనసైనికులు, మెగా అభిమానులు సంబరాల మూడ్ లో ఉన్నారు.