Pakistan: మరో టెర్రరిస్ట్ హతం.. పాక్ లో ఎగిరిపోతున్న భారత్ వ్యతిరేక ఉగ్రవాదులు.. అసలు కథేంటి?

రెహమాన్ చేపడుతున్న ఉగ్ర కలాపాల నేపథ్యంలో భారత హోం శాఖ అతడిని 2022లో ఉగ్రవాదిగా ప్రకటించింది. రెహమాన్ స్వస్థలం కాశ్మీర్లోని పుల్వామా. ఈ ప్రాంతంలో జరిగిన పలు ఉగ్ర దాడుల వెనుక అతడు కీలక సూత్రధారిగా ఉన్నాడు.

Written By: Suresh, Updated On : March 3, 2024 2:00 pm
Follow us on

Pakistan: ఒకప్పుడు వారు సరదాగా బాంబులు పెట్టి వెళ్లేవారు. అవి పేలి మనదేశీయులు చనిపోయేవారు. దాని తర్వాత కేంద్ర దర్యాప్తు బృందం రంగంలోకి దిగేది. ఆ తర్వాత విచారణ పేరుతో హడావిడి జరిగేది. ఉగ్రవాదులు దర్జాగా సరిహద్దులు దాటి పాకిస్థాన్ వెళ్లిపోయేవారు. ఇలా దశాబ్దాల పాటు జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఉగ్రవాదులకు ఎక్కడికక్కడ చెక్ పడుతోంది. మొన్నటిదాకా సరదాగా బాంబులు పెట్టి మన దేశాన్ని ఇబ్బంది పెట్టినవారు.. ఇప్పుడు ఒక్కొక్కరు చొప్పున అనుమానాస్పదంగా చనిపోతున్నారు. ఎవరో వస్తున్నారు.. మరెవరో కాల్చిపోతున్నారు.. అంతిమంగా ఉగ్రవాదులు చనిపోతున్నారు. కాకపోతే ఈ చనిపోతున్న ఉగ్రవాదులు భారత వ్యతిరేకులు.. పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తున్న ముష్కరులు.

ఇటీవల కాలంలో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా పాకిస్థాన్లోని వేరువేరు ప్రాంతాల్లో చనిపోతున్నారు. వాస్తవానికి వీరి మరణం పట్ల ఏ ఉగ్రవాద సంస్థ కూడా సానుభూతి ప్రకటించడం లేదు. కనీసం వారి మరణాన్ని ఉటంకిస్తూ వ్యాఖ్యలు కూడా చేయడం లేదు. ఎవరో కాల్పులు జరపగానే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన ఉగ్రవాదులు చనిపోవడం పరిపాటిగా మారింది. ఇక ఇటీవల పాకిస్తాన్లోని అబోటబాదు సమీపంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన షేక్ జమీల్ ఉర్ రెహమాన్.. కైబర్ ప్రావిన్స్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ అనే ఉగ్రవాద సంస్థకి అతడు స్వయంప్రకటిత ప్రధాన కార్యదర్శి. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలను ఈ సంస్థ సమావేశం చేస్తుంది. కాశ్మీర్లో దాడులకు పాల్పడుతుంది. 1990లో ప్రారంభించిన తెహ్రిక్ ఉల్ ముజాహిద్దీన్ అనే సంస్థకు షేక్ జమీల్ ఉర్ రెహమాన్ చీఫ్గా రెహమాన్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు. మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో 2019 నుంచి దీనిపై కేంద్రం నిషేధం విధించింది. అంతేకాదు ఈ సంస్థ హిజుబుల్ ముజాహిద్, లష్కరే సంస్థలకు సహకరిస్తోంది.

రెహమాన్ చేపడుతున్న ఉగ్ర కలాపాల నేపథ్యంలో భారత హోం శాఖ అతడిని 2022లో ఉగ్రవాదిగా ప్రకటించింది. రెహమాన్ స్వస్థలం కాశ్మీర్లోని పుల్వామా. ఈ ప్రాంతంలో జరిగిన పలు ఉగ్ర దాడుల వెనుక అతడు కీలక సూత్రధారిగా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం మన దేశ సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లిపోయాడు. ఆ దేశంలోని ఐ ఎస్ ఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అతడు పని చేస్తున్నాడు. కాగా రెహమాన్ మృతితో పాకిస్తాన్ దేశంలో ఉగ్రకలాపాలు తగ్గుముఖం పడతాయని భారత నిఘా విభాగం అంచనా వేస్తోంది.

రెహ్మాన్ కంటే ముందు భారతదేశంలో ముంబై ప్రాంతంలో బాంబు పేలుళ్ల సూత్రధారి లష్కరే సీనియర్ కమాండర్ అజామ్ చీమా ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.. ఈ నేపథ్యంలో అతడి హృదయానికి పాకిస్తాన్లోని మల్కాన్ వాలా ప్రాంతంలో అంత్యక్రియలు జరిపారు..26/11, 2006 ముంబై రైలు పేలుళ్ల ఘటన వెనుక అతడు కీలకపాత్ర పోషించాడు. ఆ దారుణ ఘటనలో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. 800 కి పైగా గాయపడ్డారు. 2008 లో తాజ్ హోటల్ లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు అజామ్ శిక్షణ ఇచ్చాడని భారత నిఘా విభాగం గుర్తించింది. అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది. అయితే ఇన్నాళ్లకు అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.. అయితే ఇలా వరుసగా ఉగ్రవాదులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పట్ల భారత నిఘా విభాగం హస్తం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.