Iran-Pakistan Conflict: అవి రెండు ఆసియాలో దేశాలు. ఆ రెండు దేశాల్లోనూ ఇస్లామిక్ మతస్తులే ఎక్కువగా ఉంటారు. ఇస్లామిక్ మత ఆచారాలు కూడా అక్కడ ఎక్కువ పాటిస్తూ ఉంటారు. అందులో ఒక దేశం ఇరాన్ అయితే.. మరొక దేశం పాకిస్తాన్. మన నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ దేశంతో సరిహద్దు పంచుకోవాల్సి వచ్చింది. సహజ వాయువు, చమురు నిక్షేపాలతో ఇరాన్ ఆర్థికంగా బలంగా ఉండగా…. అంతర్గత రాజకీయ సంక్షోభం, పాలనలో మితిమీరిన సైనిక జోక్యం, అవినీతి, రాజకీయ అనిశ్చితి, ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్ అంతకంతకు దిగజారిపోయింది. అయితే పాకిస్తాన్ దేశానికి మొదటి నుంచి ఇరాన్ దేశంతో సరిహద్దు సమస్యలు ఉన్నాయి. పైగా వివిధ తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వడం ఇరాన్ దేశానికి నచ్చేది కాదు. ఆ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేవారు ఇరాన్ సరిహద్దుల్లో ఆ దేశ యువతను పెడ మార్గం పట్టించేవారు.. పేరుకు ఇస్లాం దేశాలు అయినప్పటికీ పాకిస్తాన్ పాటిస్తున్న ఉగ్రవాద అనుకూల నిర్ణయాలు నేపథ్యంలో ఇరాన్ దౌత్య పరంగా దూరం పెట్టడం మొదలుపెట్టింది. అయితే ఇది ఇటీవల చినికి చినికి గాలి వాన లాగా మారి రెండు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. అంతేకాదు ఇరాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది.. అది కాస్తా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.
తన దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆశ్రయమిస్తున్న ఉగ్రవాదులు కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దాడి చేసింది. అయితే ఈ దాడులను ఇరాన్ సమర్ధించుకుంది. తమ దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆశ్రయమిస్తున్న ఉగ్రవాదులు ఇటీవల తమ కార్యకలాపాలను తీవ్రతరం చేశారని, దీనివల్ల తమ దేశ అంతర్గత భద్రత ప్రమాదంలో పడిందని ఇరాన్ ఆరోపించింది. ఈ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తాము దాడులకు పాల్పడినట్టు ఇరాన్ ప్రకటించుకుంది. ఈ దాడుల వల్ల భవిష్యత్తులో ఉగ్రవాదులు తమ దేశ సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహించాలంటే భయపడాల్సి ఉంటుందని హెచ్చరించింది. సామరస్యతకు నిలువుటద్దం లాంటి తమ దేశంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం కుదరదని పాకిస్తాన్ దేశానికి పరోక్షంగా హెచ్చరికలు పంపింది. అయితే ఇరాన్ చేసిన ఈ దాడులతో పాకిస్తాన్ స్పందించింది. సరిహద్దుల వెంట ఇలా దాడులు చేస్తే మా వైపు నుంచి కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఇరాన్ చేసిన దాడుల్లో ఇద్దరు పిల్లలు మృతి చెందారని, ముగ్గురు గాయపడ్డారని పేర్కొంది. అంతేకాదు ఇరాన్ దేశ రాయబారిని పిలిపించుకొని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం నిరసన వ్యక్తం చేసింది. ఇరాన్ ఆర్థికంగా బలంగా ఉండటంతో తమ దేశ గగనతలాన్ని దుర్వినియోగం చేస్తూ తమ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేశారని పాకిస్తాన్ ఆరోపించింది. ఇరుదేశాల మధ్య దౌత్యపరంగా చిన్న చిన్న తేడాలు మాత్రమే ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని.. కానీ వాటిని ఇరాన్ విస్మరించిందని పాకిస్థాన్ ఆరోపించింది. ఇస్లాం మతం పాటిస్తున్న తమను ఇరాన్ ఉగ్రవాద దేశంగా చూస్తూ దాడులు చేయడం సరికాదని హితవు పలికింది.
అయితే ఈ దాడులు ఎక్కడ జరిగాయో మాత్రం పాకిస్తాన్ వెల్లడించలేదు. ఉగ్రవాదం అన్నదేశాలకు పెద్ద సమస్యగా పరిణమించింది. ఉగ్రవాదం వల్ల బాధపడే దేశాలు కలసికట్టుగా ఆ సమస్యను ఎదుర్కోవాలి. అంతేగాని ఉగ్రవాదం పేరుతో సరిహద్దుల వెంట దాడులు చేయడం సరికాదు. ఏకపక్షంగా దాడులు చేస్తే అది దేశాల మధ్య అంతరాన్ని మరింత పెంచుతుంది. అది ఇతర సమస్యలకు కూడా దారితీస్తుందని పాకిస్తాన్ ఇరాన్ దేశాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ఈ దాడులను సమర్థించుకుంది.. బలుచిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరం లక్ష్యంగా తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది.. జైష్ అల్ అదిల్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో ఎంతమంది చనిపోయారు అనే విషయాన్ని మాత్రం ఇరాన్ ప్రకటించలేదు.జైష్ అల్ అదిల్ అనేది సున్నీ మిలిటెంట్ గ్రూప్. ఈ సంస్థ పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోందని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి.ఇది ఇరాన్ లోని సిస్థాన్_బలూచిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలుస్తోంది.. అయితే ఈ సంస్థ కార్యకలాపాలపై ఇరాన్ ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. పలుమార్లు పాకిస్తాన్ దేశాన్ని కూడా హెచ్చరించింది. అయినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో దాడులు చేసింది.