Homeఅంతర్జాతీయంUS Warning To Turkey: ఇజ్రాయెల్ తో పెట్టుకుంటే ఇత్తడైపోద్ది.. టర్కీకి అమెరికా హెచ్చరిక.. తీవ్ర...

US Warning To Turkey: ఇజ్రాయెల్ తో పెట్టుకుంటే ఇత్తడైపోద్ది.. టర్కీకి అమెరికా హెచ్చరిక.. తీవ్ర ఉద్రిక్తత

US Warning To Turkey: ఇరాన్‌–అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. దాదాపు వందరోజులకుపైగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. చమురు సంక్షోభం నెలకొంది. తాజా శాంతి ఒప్పందంతో ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిలో ఇజ్రాయెల్‌ శాంతి ఒప్పందంతో తమకు సంబంధం లేదని షాక్‌ ఇచ్చింది. ఇదే సమయంలో టర్కీ అధ్యక్షుడు రెజెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ ఇజ్రాయెల్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ, దాడికి సిద్ధంగా ఉన్నామని, దేనికైనా తాము సిద్ధమని పేర్కొన్నారు. ఇది టర్కీ–ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. అమెరికా మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి టర్కీకి స్పష్టమైన వార్నింగ్‌ ఇచ్చారు. ఇజ్రాయెల్‌ జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు.

టర్కీ అధ్యక్షుడి ఘాటు వ్యాఖ్యలు…
టర్కీ అధ్యక్షుడు ఇజ్రాయెల్‌ చర్యలు తమ దేశ భద్రతను బెదిరిస్తున్నాయని, లెబనాన్, సిరియా వంటి పొరుగు దేశాల్లో ఇజ్రాయెల్‌ చేస్తున్న కార్యకలాపాలు టర్కీని కూడా ప్రభావితం చేస్తున్నాయని ఆరోపించారు. ఇజ్రాయెల్‌ను శత్రువుగా చూస్తున్నామని, దాడికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం ద్వారా టర్కీ తన సైనిక సామర్థ్యాన్ని, ప్రాంతీయ ప్రభావాన్ని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇది ఎర్డోగాన్‌ దేశీయ రాజకీయాల్లో ఉపయోగపడే వ్యూహం కూడా కావచ్చు. అయితే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దౌత్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయి.

అమెరికా మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి హెచ్చరిక..
అమెరికా మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి టర్కీకి స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఇజ్రాయెల్‌ జోలికి వెళ్లకూడదని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ అమెరికాకు సన్నిహిత మిత్రుడు కాబట్టి, దాని భద్రతపై అమెరికా ఎప్పుడూ రాజీపడదని పరోక్షంగా పేర్కొన్నారు. ఈ హెచ్చరికలో భారత్‌ ఇచ్చిన ఆయుధాల ప్రస్తావన కూడా ఉంది.

టర్కీ చుట్టూ ప్రమాదం..
టర్కీ చుట్టూ ఉన్న సైప్రస్, ఆర్మేనియా, గ్రీస్‌ ఇప్పటికే భారత్‌ నుంచి ఆయుధాలు పొందాయని, ఇజ్రాయెల్‌ కూడా వాటితో కలిస్తే టర్కీకి దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించారు. ఇది టర్కీని రాజకీయంగా, సైనికంగా ఒంటరిగా చేసే వ్యూహంగా కనిపిస్తుంది.

మూడు దేశాల్లో భారత ఆయుధాలు..
భారత్‌ ఇటీవల సైప్రస్, ఆర్మేనియా, గ్రీస్‌లతో రక్షణ సంబంధాలను బలపరచింది. ఆర్మేనియాకు పినాకా రాకెట్లు, ఆకాశ్‌ క్షిపణులు, హోవిట్జర్లు వంటి ఆయుధాలు సరఫరా చేసింది. గ్రీస్, సైప్రస్‌లు కూడా భారత్‌ బ్రహ్మోస్‌ క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థలపై ఆసక్తి చూపుతున్నాయి. ఇవి టర్కీకి ప్రత్యర్థులు. టర్కీకి పాకిస్తాన్, ఆజర్‌బైజాన్‌ మద్దతు ఇస్తున్నాయి. ఇది భారత్‌ రక్షణ ఎగుమతులు పెంచడం మాత్రమే కాదు ప్రాంతీయ సమతుల్యాన్ని నిర్మించే వ్యూహం.

ఇజ్రాయెల్‌తో కలిస్తే…
అమెరికా మాజీ అధికారి చెప్పినట్లు, ఇజ్రాయెల్‌ ఆర్మేనియా, సైప్రస్, గ్రీస్‌తో కలిస్తే టర్కీకి బహుముఖ సవాలు ఏర్పడుతుంది. తూర్పు మధ్యధరా ప్రాంతంలో గ్రీస్‌–సైప్రస్‌–ఇజ్రాయెల్‌ కూటమి ఇప్పటికే బలంగా ఉంది. ఆర్మేనియా కూడా చేరితే టర్కీ ఒంటరిగా మారుతుంది. అయితే టర్కీ నాటో సభ్య దేశం. బలమైన సైన్యం కలిగి ఉంది. నేరుగా యుద్ధం జరిగే అవకాశం తక్కువే. కానీ రెచ్చగొట్టే మాటలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.

తాజా పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో అలయన్స్‌లు ఎలా మారుతున్నాయో చూపిస్తున్నాయి. భారత్‌ రక్షణ దౌత్యం ద్వారా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. అమెరికా ఇజ్రాయెల్‌కు అండగా నిలబడటం స్పష్టం. టర్కీ మాత్రం ఇజ్రాయెల్‌ను శత్రువుగా చూడడం కొనసాగిస్తోంది. అయితే యుద్ధం ఎవరికీ మంచిది కాదు. దౌత్యం, చర్చలు మాత్రమే సుస్థిర పరిష్కారం. సైప్రస్‌ సమస్య, ఆర్మేనియా–అజర్‌బైజాన్‌ వివాదం, భారత్‌ వంటి దేశాలు సమతుల్య విధానం పాటించడం ద్వారా ప్రాంతీయ శాంతిని కాపాడవచ్చు. ఈ ఉద్రిక్తతలు టర్కీని ఒంటరిగా చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. కానీ వాస్తవికంగా చూస్తే, అన్ని దేశాలు తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular