Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత ఆ దేశం దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ప్రతీకార సుంకాల ప్రారంభించాడు. ఒక్కో దేశానికి ఒక్కో విధంగా టారిఫ్లు విధించి షాక్ ఇచ్చాడు. చైనా దిగుమతులపై అయితే 100 శాతానికిపైగా టారిఫ్లు వేశాడు. తర్వాత చర్చల జరిపి వెనక్కి తగ్గాడు. భారత్పై కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందన్న సాకుతో 50 శాతానికిపైగా సుంకాలు విధించాడు. ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత సుంకాలు నిలిపివేశాడు. ఇదే సమయంలో అమెరికా సుప్రీం కోర్టు కూడా టారీఫ్లను తప్పు పట్టింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి వాణిజ్య రంగంలో బలమైన నిర్ణయం తీసుకున్నారు. 2028 నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని రకాల జెనరిక్ మందులపై 100 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. 2029లో దీన్ని 200 శాతానికి పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపాడు. ఈ రెండేళ్లలో ఫార్మా కంపెనీలు అమెరికాలోనే ఫ్యాక్టరీలు నిర్మించాలని, లేదంటే భారీ పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితి
ప్రస్తుతం అమెరికాకు దిగుమతి అయ్యే జెనరిక్ మందులపై సుంకాలు లేవు(జీరో శాతం). దీంతో భారత్, చైనా వంటి దేశాల నుంచి చాలా మందులు సులభంగా, తక్కువ ధరకు అమెరికాకు వెళ్తున్నాయి. ట్రంప్ ఈ స్థితిని మార్చాలని నిర్ణయించారు. రెండేళ్లలో అమెరికాలో ఫ్యాక్టరీలు నిర్మించాలి లేకపోతే భారీగా జరిమానాలు తప్పవని ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా అమెరికాలో ఉద్యోగాలు సృష్టించడం, విదేశీ ఆధారపడటం తగ్గించడం ట్రంప్ లక్ష్యం.
భారత ఫార్మా కంపెనీలపై ప్రభావం
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద జెనరిక్ మందుల తయారీదారు. అమెరికాకు ఎక్కువగా ఎగుమతి చేసే దేశాల్లో ఒకటి. ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయ కంపెనీల ఎగుమతులు ఖరీదైపోయే అవకాశం ఉంది. అమెరికాలో ఫ్యాక్టరీలు పెట్టాలంటే భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. చిన్న–మధ్య తరహా కంపెనీలకు ఇది కష్టంగా మారవచ్చు.
ఎందుకీ నిర్ణయం..
ట్రంప్ నిర్ణయం ‘అమెరికా ఫస్ట్‘ విధానంలో భాగం. విదేశీ కంపెనీలను అమెరికాలో ఉత్పత్తి చేయమని బలవంతం చేయడం ద్వారా స్థానిక ఉద్యోగాలు పెరగాలని, సరఫరా గొలుసు అమెరికాలోనే ఉండాలని ఆయన భావిస్తున్నారు. భారత ఫార్మా రంగానికి ఇది పెద్ద సవాలు. ఎగుమతులు తగ్గితే ఆదాయం పడిపోవచ్చు. అయితే పెద్ద కంపెనీలు అమెరికాలో ఫ్యాక్టరీలు పెట్టి, లేదా ఇతర దేశాలకు ఎగుమతులు పెంచి సర్దుబాటు చేసుకోవచ్చు. అమెరికా పౌరులకు మందుల ధరలు పెరుగుతాయి.
మొత్తంమీద, ట్రంప్ నిర్ణయం వాణిజ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. భారత ఫార్మా కంపెనీలు ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకోవాలి. కొందరు అమెరికాలో పెట్టుబడి పెట్టవచ్చు, మరికొందరు కొత్త మార్కెట్లను వెతకవచ్చు. రాబోయే రెండేళ్లు భారత ఫార్మా రంగానికి కీలకమైనవి.








