Homeఅంతర్జాతీయం9/11 Attack: విమానాలు హైజాక్‌ చేసి.. కీలక స్థావరాలపై దాడి..అమెరికన్ల గుండెల్లో దడ పుట్టించిన 9/11...

9/11 Attack: విమానాలు హైజాక్‌ చేసి.. కీలక స్థావరాలపై దాడి..అమెరికన్ల గుండెల్లో దడ పుట్టించిన 9/11 ఘటన.. 23 ఏళ్లైనా మాయని గాయం..

9/11 Attack: సెప్టెంబర్‌ 11.. ఈ తేదీ అమెరికా చరిత్రలో మర్చిపోలేని రోజు. ప్రతీ అమెరికన్‌లో ఈ తేదీ వింటేనే తెలియని భయం పుడుతుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైనిక కేంద్రం పెంటగాన్‌పై జరిగిన దాడిని మర్చిపోతున్న అమెరికన్లకు సరిగ్గా 60 ఏళ్ల తర్వాత 2001లో అల్‌ఖైదా ఉగ్రమూక జరిపిన అనూహ్యమైన.. ఊహకు అందని భీకర దాడి.. పెను భయోత్పాతం సృష్టించింది. అప్పటి వరకు తమకు తిరుగు లేదు.. భయం లేదు అనుకున్న అగ్రరాజ్యానికి భయం అంటే ఎలా ఉంటుందో తెలియజేసింది. మతఛాందస నరహంతకుడిగా ముద్రపడ్డ అల్‌ఖైదా అగ్రనాయకుడు ఒసామాబిన్‌ లాడెన్‌ కనుసన్నల్లో న్యూయార్క్‌ నడిబొడ్డున నరమేథం జరిగింది. ఈ ఘటన జరిగి నేటికి 23 ఏళ్లు. అమెరికా విమానాలనే మృత్యు పాశాలుగా మార్చిన లాడెన్‌.. వాటిని ఆమెరికన్లపైకే ప్రయోగించి మారణహోమం సృష్టించాడు. నాడు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. ఆ దాడిలో గాయపడి చికిత్స పొందుతూ 2023 నాటికి మరో 5,700 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇక నాటి ఘటనను కళ్లారా చూసిన వాళ్లు ఇప్పటికీ నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు.

దాడి చేసిందిలా..
ఉగ్రవాద శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాకు చెందిన నాలుగు విమానాలను హైజాక్‌ చేశారు. అందులో రెండు విమానాలు న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ టవర్స్‌ లక్ష్యంగా ఉదయాన్నే దాడి చేశారు. మరో విమానంతో పెంటగాన్‌పై దాడి చేశారు. నాలుగో విమానంలో ప్రయాణికులు ఎదురు తిరగడంతో ఉగ్రవాదులకు వారికి మధ్య జరిగిన ఘర్షణలో విమానం అదుపుతప్పి శాంక్స్‌విల్లే సమీపంలో కూలింది. ఈ విమానాన్ని వాషింగ్టన్‌పై దాడికి ఉపయోగించాలని ఉగ్రవాదులు భావించినట్లు విచారణలో తేలింది. ఈ దాడిలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్స్‌ మీద జరిగిన దాడిలో 2చ753 మంది మరణించారు. వీరిలో ఫైర్‌ ఫైటర్స్‌ దాదాపు 343 మంది వరకు ఉన్నారు. అమెరికా సైనిక స్థావరం పెంటగాన్‌పై జరిగిన దాడిలో మరో 184 మంది చనిపోగా.. పెన్సిల్వేనియాలోని శాంక్స్‌విల్లే ఘటనలో 40 మంది పౌరులు చనిపోయారు.

కుట్ర వెనుక లాడెన్‌
ఈ దాడి వెనకున్నది నాటి అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ కాగా.. ముందుండి నడిపింది మాత్రం ఖలీద్‌ షేక్‌ మహమూద్‌. విమానాలతో దాడి చేయాలన్న పథకం ఖలీద్‌దే.. ఉగ్రవాదులను, అవసరమైన నిధులను సమకూర్చింది మాత్రం అల్‌ఖైదానే. సౌదీ అరేబియాకు చెందిన ఉగ్రవాదులతో కూడిన 19 మందికి మొహమ్మద్‌ అట్టా నేరుగా దాడిలో పాల్గొని నేతృత్వం వహించాడు. వీరిలో కొందరు విమానాలు నడపడంలోనూ శిక్షణ పొందారు.

వెంటాడి.. వేటాడి..
ఇదిలా ఉంటే.. ఈ దాడికి మాస్టర్‌మైండ్‌గా భావించే మొహమూద్‌ను 2003లో అమెరికా సైన్యం పట్టుకుంది. ఉగ్ర నాయకుడు ఒసామాబిన్‌ లాడెన్‌ను అమెరికా వెంటాడి వేటాడి… 2011లో పాకిస్తాన్‌లోని ఒక అబోటాబాద్‌లో నిర్వహించిన రహస్య ఆపరేషన్లో నేవీ సీల్స్‌ మట్టుపెట్టాయి. తద్వారా అతడి కోసం సాగించిన పదేళ్ల వేటకు తెరపడింది. లాడెన్‌ శవాన్ని కూడా హిందూమహాసముద్రంలో గుర్తు తెలియని ప్రదేశంలో అమెరికా సైన్యం ఖననం చేసింది. అప్పటి వరకూ అతడి తలమీద 25 మిలియన్‌ డాలర్ల విలువ ఉండగా.. 2001 సెప్టెంబర్‌ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అమెరికా మొదలు పెట్టిన ఉగ్రవేట ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్‌ 11న దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులందరూ ఆ దాడిలోనే చనిపోయారు.

ఎన్నికల సమయంలో దాడి..
2001, సెప్టెంబర్‌ 11 దాడి సమయంలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సమరం మొదలైంది. దాడి అనంతరం జార్జ్‌ బుష్‌ తీసుకున్న స్విఫ్ట్‌ యాక్షన్‌కు 90 శాతం అమెరికన్లు మద్దతుగా నిలిచారు. మరోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు. న్యూయార్క్‌ ఉగ్రదాడి జరిగిన ప్రదేశాన్ని తొలుత గ్రౌండ్‌ జీరోగా పిలిచిన అమెరికన్లు.. క్రమంగా దాని నుంచి బయటపడి 2014 నాటికి ఒక వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ టవర్‌తో పాటు సెప్టెంబర్‌ 11 దాడులను వివరించే మ్యూజియం సహా మమోరియల్‌ నిర్మించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version