Pakistan terrorist hub: పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డా.. ఇదివరకే చాలాసార్లు నిరూపితమైంది. తాజాగా ఇటీవల పాకిస్తాన్లో హతమైన పుల్వామా దాడి సూత్రధారి హమ్జా బుర్హాన్ అంత్యక్రియల వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, అల్–బదర్ సంస్థ నాయకుడు భక్త్ జమీన్ ఖాన్ వంటి భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఒకేచోట కనిపించడం, పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఇప్పటికీ సేఫ్ హెవెన్గా మిగిలి ఉందన్న నిజాన్ని మరోసారి ఎత్తి చూపుతోంది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన భయంకరమైన సూసైడ్ బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడికి ప్రధాన సూత్రధారి అని భారత ఏజెన్సీలు గుర్తించిన హమ్జా బుర్హాన్ పాకిస్తాన్ భూభాగంలోనే హతమయ్యాడు. అతని అంత్యక్రియలకు వచ్చిన ఉగ్రవాద నాయకుల జాబితా చూస్తే ఆందోళన కలగకమానదు. గుర్తుతెలియని వ్యక్తుల బెదిరింపుల భయంతో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వారు హాజరవడం పాక్ అధికారులు ఈ ఉగ్రవాదులను రక్షిస్తున్నారనే అనుమానాలను మరింత బలపరుస్తుంది.
పాకిస్తాన్ డబుల్ గేమ్..
పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై ‘‘మేము ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తున్నాం’’ అని ప్రకటించినప్పటికీ, వాస్తవం పూర్తి వ్యతిరేకం. హమ్జా బుర్హాన్ అంత్యక్రియలు ఈ డబుల్ గేమ్ను మరోసారి బయటపెట్టాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి సంస్థలు పాక్ సైన్యం, ఐఎస్ఐ మద్దతుతోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని భారత్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అల్–బదర్ వంటి ఇతర సంస్థలు కూడా కాశ్మీర్లో హింసను ప్రేరేపిస్తున్నాయి. ఇలాంటి ఉగ్ర నాయకులు పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరగడం, పబ్లిక్గా అంత్యక్రియలు జరపడం ఆ దేశం ఉగ్రవాదాన్ని రాజ్యాంగ భాగంగా చేసుకుందని సూచిస్తోంది.
వీడియో వైరల్..
హమ్జా బుర్హాల్ అంత్యక్రియల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక నేతలు ఉండడంతో దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘‘పాకిస్తాన్ టెర్రరిస్టుల స్వర్గధామం’’ అని మండిపడుతున్నారు. వారి కోపం సహజమే. ఎందుకంటే భారత్లో ఉగ్రవాద దాడులకు ప్రతీసారీ పాకిస్తాన్ నుంచే మద్దతు ఉంటుందని చరిత్ర చెబుతోంది. ఈ ఘటన భారత భద్రతా వ్యవస్థకు మరో హెచ్చరిక. మనం కేవలం ఖండనలు మాత్రమే చేసి సరిపెట్టకూడదు. దౌత్యపరమైన ఒత్తిడిని మరింత పెంచాలి. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చాలి. సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయాలి. కాశ్మీర్లో స్థానిక యువతను ఉగ్రవాద సాయకత్వం నుంచి దూరం చేసే సమగ్ర వ్యూహం అవసరం.
పాకిస్తాన్ తన భూమిని ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా చివరికి తనకే ప్రమాదం తెచ్చుకుంటోంది. ఉగ్రవాదం ఒక్క దేశానికి మాత్రమే కాదు – ప్రపంచ శాంతికి ముప్పు, హమ్జా బుర్హాన్ అంత్యక్రియలు కేవలం ఒక వ్యక్తి మరణం కాదు. అది పాకిస్తాన్ అసలు రూపాన్ని మరోసారి బయటపెట్టిన ఘటన. భారత్ ఇక మాటలు కాదు, ఫలితాలు చూపించే సమయం వచ్చింది. ఉగ్రవాదాన్ని పోషించే దేశాలు చివరికి తమే దాని బాధితులవుతారన్న వాస్తవాన్ని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి.
पुलवामा हमले के मास्टरमाइंड हमजा बुरहान के जनाजे में दिखे कई बड़े पाकिस्तानी आतंकी #PulwamaAttack #HamzaBurhan #PakistanTerrorists #JaishTerror #TerrorFuneral
[ Pulwama, Hamza Burhan, Pakistani Terrorists, Funeral, Mastermind ] pic.twitter.com/tNgzevLj7x
— One India News (@oneindianewscom) May 23, 2026
