Khawaja Asif: కాంగ్రెస్ గెలిస్తే .. కాశ్మీర్ ను పాక్ కు అమ్మేస్తారేమో.. పైగా పాకిస్తాన్ మంత్రి సపోర్ట్

దాదాపు పది సంవత్సరాల తర్వాత జమ్ము కాశ్మీర్లో అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి దశ పోలింగ్ పూర్తయింది. రెండు, మూడు దశల్లో పోలింగ్ త్వరలో జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : September 19, 2024 8:51 pm

Khawaja Asif

Follow us on

Khawaja Asif: జమ్ము కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని సాగించాయి. విజయంపై ఎవరి ధీమా వారిలోనే ఉంది. ఈ సమయంలోనే పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. అంతేకాదు జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఆయన చెప్పిన జోస్యం సంచలనానికి దారితీస్తోంది..” జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 ని పునరుద్ధరించేందుకు ఆ దేశంలోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. భారతదేశంలోని కాంగ్రెస్ – నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఒకే వైఖరితో ఉన్నాయి. జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ – నేషనల్ కాన్ఫరెన్స్ అలయన్స్ విజయం సాధిస్తాయి. ఆ కూటమి 370 ఆర్టికల్, 35ఏ ఆర్టికల్ పునరుద్ధరణకు తోడ్పడతాయని నమ్మకం మాకుంది. ఈ విషయంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, మా వైఖరి ఒకే విధంగా ఉందని” పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసీఫ్ జియో న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

నేషనల్ కాన్ఫరెన్స్ ఒక మాట.. కాంగ్రెస్ ఒక మాట

జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమిగా కలిసి పోటీ చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ చెబుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్దంగా ఉంది. ఈ విషయాన్ని కనీసం వాటి ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించలేదు. జమ్ము కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. ఆర్టికల్ 37 ని రద్దు చేయడం, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వల్ల ప్రజలు భావోద్వేగాలు పెరిగాయని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. కాశ్మీర్ లోయ ప్రాంతంలో ఈ ప్రభావం అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి పార్టీలు ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రచారం చేశాయి.

బిజెపి ఏమంటుందంటే..

పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బిజెపి నాయకులు స్పందించారు..” కాంగ్రెస్ గెలిస్తే .. కాశ్మీర్ ను పాక్ కు అమ్మేస్తారేమో.. పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం. కాశ్మీర్ పై వైఖరిలో కాంగ్రెస్ – నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి ఆ పాకిస్తాన్ మద్దతు ఇస్తోంది.. దీనిని బట్టి రాహుల్ గాంధీ భారత దేశ ప్రయోజనాల విషయంలో ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని” బిజెపి నాయకుడు అమిత్ మాలవ్య స్పష్టం చేశారు..కాగా, జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఏడు జిల్లాల పరిధిలో తొలి దశలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరిగింది. మొత్తం 61% పోలింగ్ నమోదయింది. గత 35 సంవత్సరాలలో ఈ పోలింగ్ అత్యధికం. కిశ్త్ వాద్ జిల్లాలో ఎక్కువగా 77% పోలింగ్ నమోదయింది. పుల్వామా జిల్లాలో అత్యధికంగా 46% ఓటింగ్ నమోదయింది.. ఇక మిగతా 66 నియోజకవర్గాలకు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న పోలింగ్ జరుగుతుంది.