Oldest Countries: అత్యంత పురాతన దేశాలు ఏవి.. వాటిలో భారత్ స్థానం ఎంత అంటే?

ప్రపంచంలో అత్యంత పురాతనమైన దేశాల్లో ఇరాన్, ఈజిప్టు, సిరియా, వియత్నం, ఆర్మేనియా, కొరియా, చైనా, భారతదేశం నిలుస్తున్నాయి. ఇవన్నీ క్రీస్తు పూర్వం ఏర్పడడం విశేషం.

Written By: Dharma, Updated On : February 27, 2024 9:14 am
Follow us on

Oldest Countries: ప్రపంచంలో అత్యంత పురాతనమైన దేశాలు ఎన్నో ఉన్నాయి. శతాబ్దాలుగా ఇవి తమ ఉనికిని చాటుకుంటూ వచ్చాయి. అందులో ఇండియా కూడా ఉండడం విశేషం. ప్రాచీన సాంప్రదాయాలు, సంస్కృతుల మేలవింపు భారతదేశము. అన్ని మతాల సమాహారం. ఎన్నెన్నో జాతులు, వర్గాలను ఇముడ్చుకున్న మహాసముద్రం మన దేశం.ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది దేశాలు అత్యంత పురాతనమైనవిగా నిలుస్తున్నాయి. అందులో భారతదేశంలో ఏ స్థానంలో నిలుస్తుందో ఒకసారి తెలుసుకుందాం.

ప్రపంచంలో అత్యంత పురాతనమైన దేశాల్లో ఇరాన్, ఈజిప్టు, సిరియా, వియత్నం, ఆర్మేనియా, కొరియా, చైనా, భారతదేశం నిలుస్తున్నాయి. ఇవన్నీ క్రీస్తు పూర్వం ఏర్పడడం విశేషం. ఇరాన్ అత్యంత పురాతన దేశం. క్రీస్తుపూర్వం 3200లో ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది. ఇరాన్ ను 20వ శతాబ్దం మధ్యకాలం వరకు పర్షియా అని పిలిచేవారు. ఇరాన్ కు పురాతన ప్రధాన నాగరికతలలో గొప్ప చరిత్ర ఉంది. ప్రస్తుతం ఇరాన్ కు టెహ్రాన్ రాజధానిగా ఉంది. తరువాత పురాతన దేశాల్లో ఈజిప్టు ఉంది. క్రీస్తుపూర్వం 3100లో ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది. అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ అనేది అసలు పేరు. నార్మర్ మెనెస్ అనే రాజు ఈ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీని రాజధాని మొదట మేంఫిష్ కాగా.. ఇప్పుడు కైరోగా ఉంది.

సిరియా అత్యంత పురాతన దేశం. క్రీస్తుపూర్వం 3000 నాటి దేశమిది. పురావస్తు తవ్వకాల్లో ఎల్బా అనే నగరం బయటపడింది. ఇది క్రీస్తుపూర్వం 3000 నాటిదని అక్కడి ప్రజలు నమ్ముతారు. వియత్నం కూడా పురాతన దేశమే. క్రీస్తుపూర్వం 2,879లో ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది. మంచి సాంప్రదాయాలకు బీజం వేసింది ఈ దేశమే. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తారు ఇక్కడ. ప్రస్తుతం దీని రాజధాని హనోయి. అర్మేనియాది కూడా సుదీర్ఘ చరిత్ర. క్రీస్తుపూర్వం 2492లో ఏర్పడింది ఈ దేశం. క్రీస్తు శకం 301లో క్రైస్తవ మతాన్ని తమ రాష్ట్ర మతంగా స్వీకరించిన వారిలో అర్మేనీయులు మొదటి వారు. మతపరమైన వారసత్వం కొనసాగించడంలో ఈ దేశం ముందంజలో ఉంది. కొరియా క్రీస్తుపూర్వం 2333లో ఏర్పడినట్టు చరిత్ర చెబుతోంది. కాలానుగుణంగా కొరియా రాజధాని నగరాలు మారుతుంటాయి. వీటిలో జోల్బన్, గుంగ్నే, పొంగ్యాంగ్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ దేశం ఉత్తరకొరియా, దక్షిణ కొరియాలుగా ముక్కలు అయింది. ఇక్కడ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి.
చైనా కూడా పురాతనమైన దేశాల్లో ఒకటి. క్రీస్తుపూర్వం 2070లో ఏర్పడింది. అప్పట్లో రాజధానిగా జియాన్, ప్రస్తుతం బీజింగ్ గా మారింది. యూ ది గ్రేట్ స్థాపించినట్లుచరిత్ర చెబుతోంది.

ప్రపంచంలో అత్యంత పురాతన దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. క్రీస్తుపూర్వం 2000లో సింధులోయ నాగరికతతో భారతదేశం ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతుంటారు. భారతదేశ స్థాపనకు సింధులోయ నాగరికత లేదా రాజు చంద్రగుప్త మౌర్య కారణమని చెబుతుంటారు. మొదట పాటలీపుత్ర భారత రాజధానిగా కొనసాగింది. రెండు లక్షల 50 వేల సంవత్సరాల నాటి గొప్ప చరిత్రను భారతదేశము కలిగి ఉందని చరిత్రకారులు చెబుతుంటారు.