Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి హిమాలయ రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యకాలంలో ప్రకృతి ఉత్పాతాలు తరచూ సంభవిస్తున్నాయి.
వాతావరణ మార్పు ప్రభావం
హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1950 తర్వాత సగటు కంటే రెండు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో గత రెండు దశాబ్దాల్లో వేడి ఒక డిగ్రీ మేర పెరిగింది. దీని వల్ల మేఘాలు ఒక్కసారిగా పేరుకుపోయి భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. కొండలు బలహీనపడి చరియలు విరిగిపడటం సాధారణమవుతోంది. అలాగే అడవుల్లో కార్చిచ్చులు కూడా పెరుగుతున్నాయి.
మానవ కార్యకలాపాలతో విధ్వంసం..
హిమాలయాలు భారతదేశానికి ముఖ్యమైన జలవనరులు. సహజ రక్షణగా ఉన్నాయి. అయితే ఇవి భూకంపాలకు గురయ్యే అస్థిర ప్రాంతాలు. రహదారులు, సొరంగాలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, పర్యాటక వసతుల కోసం వరద ప్రాంతాల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. అడవుల్లో విచ్చలవిడి తవ్వకాలు, ఆక్రమణలు జరుగుతున్నాయి. ఫలితంగా హిమాలయాల్లో చెట్ల విస్తీర్ణం రెండేళ్లలోనే 2.27 శాతం తగ్గింది. గతంలో జమ్మూ కశ్మీర్లోనే విపత్తుల్లో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది వేలకు పైగా ఇళ్లు నాశనమయ్యాయి. దాదాపు 78 వేల ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. ఉత్తరాఖండ్లో 2020–23 మధ్య 213 మంది మతి చెందారు. ఈ నష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
హిమానీనదాల కరిగడంతో…
వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం, పంట అవశేషాల దహనం వల్ల హిమాలయాలపై నల్లబూడిద పేరుకుపోతోంది. దీనివల్ల మంచు వేగంగా కరిగి నదుల్లో నీళ్లు ఒక్కసారిగా పెరిగి వరదలు సృష్టిస్తున్నాయి. అధ్యయనాల ప్రకారం ఈ శతాబ్దం చివరికి హిందూకుష్ హిమాలయ ప్రాంతంలోని 80 శాతం హిమానీనదాలు అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది.అలా జరిగితే గంగా–సింధు మైదానాల్లో నీటి కొరత తీవ్రమవుతుంది. దాదాపు 70 కోట్ల మంది ప్రజల జీవనం ప్రభావితమవుతుంది.
సంరక్షణకు చర్యలు తీసుకుంటే..
హిమాలయాల సంరక్షణకు మహేశ్ కమిటీ, చోప్రా సంఘం వంటి నిపుణుల సూచనలు అమలు చేయాలి. సుప్రీంకోర్టు సూచించినట్లు అభివృద్ధి పనులు, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతౌల్యం తీసుకురావాలి. వరద మైదానాల్లో నిర్మాణాలు నియంత్రించాలి. అడవులను పరిరక్షించాలి. కాలుష్యం తగ్గించి హిమానీనదాల కరిగడాన్ని నియంత్రించాలి.
హిమాలయాలు భారతదేశానికి అమూల్యమైన సంపద. వాటిని రక్షించకపోతే వచ్చే తరాలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ప్రభుత్వాలు, ప్రజలు కలిసి ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడానికి తక్షణం చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి అవసరం, కానీ ప్రకృతిని నాశనం చేసే విధంగా కాకుండా స్థిరమైన మార్గంలో ఉండాలి.


