Ajith Doval  : మోడీ రష్యా వెళ్లాడు, వచ్చాడు.. ఇప్పుడు అజిత్ దోవల్ వెళ్తున్నాడు.. ఇంతకీ ఏం జరుగుతోంది?

మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా వెళ్లాడు. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమయ్యాడు. చైనా తొడలు కొడుతున్న సమయంలో.. ముడి చమురు కోసమో.. ఆయుధాల కోసమో మోడీ రష్యా వెళ్లి ఉంటాడని అంతర్జాతీయ మీడియా రాసింది..

Written By: Anabothula Bhaskar, Updated On : September 8, 2024 7:11 pm

Ajith Doval 

Follow us on

Ajith Doval  : సహజంగానే తను ఇతర దేశాలకు మోడీ వెళ్లినప్పుడు ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. అది భారతదేశ ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. తాజాగా మోడీ రష్యా వెళ్ళినప్పుడు కూడా అలాంటి ప్రయోజనాలు భారత్ కు లభించాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో అనేక అడుగులు మోడీ పర్యటన ద్వారా పడ్డాయి. మోడీ చెప్పిన అన్నింటికీ పుతిన్ తల ఊపాడు.. మీకు మీరు.. మాకు మేము అనే సామెతను నిజం చేసి చూపించాడు. కానీ మోడీ రష్యా వెళ్ళింది అందుకోసం మాత్రమే కాదు.. మోడీ రష్యా వెళ్లి వచ్చిన తర్వాత.. ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా రష్యా వెళ్ళనున్నారు. ఈ మేరకు జాతీయ మీడియా ప్రత్యేక కథనాలలో ఈ విషయాన్ని వెల్లడించింది. అజిత్ దోవల్ తన పర్యటనలో భాగంగా బ్రిక్స్ జాతీయ భద్రతా దారుల సదస్సులో పాల్గొంటారు. ఇదే సమయంలో రష్యా, చైనా దేశాల చెందిన కీలక అధికారులతో భేటీ అవుతారు.. గత నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టెలిఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా అజిత్ దోవల్ విషయం ప్రస్తావనకు వచ్చింది. ” బ్రిక్స్ దేశాల సదస్సులో అజిత్ పాల్గొంటారు. అదే సమయంలో ఉక్రెయిన్ శాంతి స్థాపన కోసం జరిపే ఆలోచనలలో ఆయన భాగస్వామి అవుతారని” నరేంద్ర మోడీ పుతిన్ తో పేర్కొన్నారు.

ఉక్రెయిన్ లో మోడీ పర్యటించారు

ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉక్రెయిన్ దేశంలో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు చర్చలు జరిపారు. ” చర్చలు యుద్ధానికి పరిష్కార మార్గాన్ని చూపుతాయి. దౌత్య విధానం శాంతి స్థాపనకు మార్గం వేస్తుంది. నన్ను ఒక మిత్రుడు గా భావించి శాంతి స్థాపన కోసం రష్యాతో మాట్లాడతాను. ఉక్రెయిన్ లో మామూలు పరిస్థితులు తీసుకొస్తాను. యుద్ధాన్ని భారత్ ఎప్పుడూ ప్రోత్సహించదు. శాంతి వైపు మాత్రమే భారత్ అడుగులు వేస్తుంది. తటస్థ వైఖరి అనేది మా పరిశీలన లో లేదని” అప్పట్లో మోడీ జెలెన్ స్కీ తో వ్యాఖ్యానించారు.. ఇక ఇటీవల యుద్ధానికి సంబంధించి నిలుపుదల చర్చల్లో బ్రెజిల్, భారత్, చైనా మాత్రమే ఆ బాధ్యతను తీసుకోగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. ఇక ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో శనివారం చర్చలు జరిపారు. యుద్ధాన్ని నిలువరించగలిగే సామర్థ్యం భారత్, చైనాకు మాత్రమే ఉన్నాయని, ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు ఆ రెండు దేశాలు కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.