“ఆకాశం మీద ఎగిరేటివి.. నేల మీద నడిచేవి.. పాకేవి.. నీళ్లల్లో ఈదేవి.. ఇలా అన్నింటిని తినేస్తుంటారు. వారి ఆకలి ముందు ప్రపంచంలో ఏ జీవరాశి కూడా మనుగడ సాగించలేదు.” కోవిడ్ ప్రబలిన సమయంలో చైనా దేశస్థుల ఆహార అలవాట్లపై సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అయిన జోక్ అది. దాన్ని నిజం చేసే లాగానే చైనా దేశస్థుల ఆహారపు అలవాట్లు ఉంటాయి. వారు దేన్నైనా తింటారు. నచ్చినట్టు వండుకుంటారు. సరే అవి వారి ఆహారపు అలవాట్లు. దాన్ని మనం తప్పు పట్టలేం.. చైనా దేశస్తుల జాబితాలో గాడిదలు కూడా చేరాయి. ఏంటి చైనా దేశస్థులు గాడిద మాంసం కూడా తింటారా? అని ఆశ్చర్యపోకండి.. ఈ కథనం చదివితే అసలు విషయం తెలుస్తుంది.
ఈ భూమి మీద దాదాపు 5 కోట్ల వరకు గాడిదలు ఉన్నాయి. గాడిదల్లో మూడింట రెండవ వంతు ఆఫ్రికా దేశాల్లోనే ఉన్నాయి. అక్కడి ప్రజలకు ఈ గాడిద పాలే జీవనాధారం. ఈ గాడిద పాలల్లో విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల ఇటీవల వీటి వినియోగం విపరీతంగా పెరిగింది. అందువల్ల ఆఫ్రికా దేశస్థులు గాడిదల పెంపకాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. అయితే ఆఫ్రికా దేశాల్లో ఇటీవల గాడిదల దొంగతనం పెరిగిపోయింది. దీంతో అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది. అలా దొంగతనంగా గాడిదలను కొంతమంది ముఠా సభ్యులు అక్రమంగా చైనా తరలిస్తున్నారట. రాత్రికి రాత్రే గాడిదలను దొంగతనం చేసి దొడ్డిదారిన చైనాకు పంపిస్తున్నారట.. అయితే మొదట్లో చాలామంది గాడిదల మాంసాన్ని చైనా వాసులు తినడానికే ఇలా దొడ్డి దారిన తెప్పించుకుంటున్నారని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి అవాక్కవుతున్నారు.
గాడిదల చర్మం దళ సరిగా ఉంటుంది. ఆ చర్మంతో వివిధ రకాల ఉత్పత్తులు మాత్రమే కాదు.. అందులో జెలటిన్ అనే పదార్థం ఉంటుంది. దానితో ఒక రకమైన ఔషధాన్ని తయారు చేస్తారు. అది ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని మెరుగుపరుస్తుందని చైనా దేశస్థుల నమ్మకం. జెలటిన్ కోసం చైనా వాసులతోపాటు ఇతర దేశాల్లో ప్రతి సంవత్సరం 59 లక్షల గాడిదలను వధిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా గాడిదలను అక్రమంగా తమ దేశం నుంచి రవాణా చేయడం పట్ల ఆఫ్రికా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇలా గాడిదలను తరలించుకొని పోతుంటే తమ ఉపాధి సంగతి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే గాడిదలను దొంగతనం చేస్తున్న ముఠాలపై అక్కడి ప్రజలు స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేశారు.