YS Jagan Kapu Strategy: వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం సొంత సామాజిక వర్గం వారికి ఎంత మాత్రం అర్థం కావడం లేదు. లేని దాని గురించి పాకులాడుతూ.. ఉన్నవాటిని పోగొట్టుకున్న చందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అని సొంత సామాజిక వర్గం వారి వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నా బీసీలు, నా ఎస్సీలు అన్నారు. ఇప్పుడేమో నా కాపులు అంటూ రాజకీయం చేస్తుండడం పై రెడ్డి సామాజిక వర్గంలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు సొంత సామాజిక వర్గాన్ని చూడలేదు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా సొంత సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు. 2014, 2019 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం పెద్ద సాహసమే చేసింది. కానీ 2024 కు వచ్చేసరికి మాత్రం చేతులెత్తేసింది ఆ సామాజిక వర్గం.
ఏకతాటి పైకి రెడ్డి సామాజిక వర్గం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రెడ్డి సామాజిక వర్గమంతా ఒకే తాటి పైకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచింది. వైసీపీ అంటే తమ పార్టీ అన్నట్టు రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకుంది. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఆ నలుగురు తప్ప మిగతా నేతలకు ఎటువంటి అవకాశం లేదు. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేదవర్గాలకు కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఆ సామాజిక వర్గం మనసు మారింది. 2024 ఎన్నికల్లో పూర్తిగా వారు సైలెంట్ అయ్యారు. అలాగని వారు వైసీపీని వీడలేదు. కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేయడం లేదు.
అన్ని వర్గాలు దూరం..
అధికారంలో ఉన్నప్పుడు నా బీసీలు అంటూ బీసీ పల్లవి అందుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో కాపులను వదిలేశారు. రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీలు, ఎస్సీలు తమ వెంట ఉంటారని అంచనా వేసుకున్నారు. కానీ అన్ని వర్గాలు దూరం కాగా రెడ్డి సామాజిక వర్గం వారు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కాపులు అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. సొంత పార్టీ నేతలతో కాపుల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. దీంతో మిగతా సామాజిక వర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచనపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అయితే రుస రుసలాడుతోంది. ఇంత జరిగాక కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా కుల రాజకీయాలను పట్టుకుని వేలాడుతుండడం పై చర్చ నడుస్తోంది. కులాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి తప్ప.. ఇలా కుల రాజకీయాలను నమ్ముకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.
