IT Layoffs: ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగం అంటే చాలామంది గొప్పగా చెప్పుకునేవారు. ఎందుకంటే వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. రెండు రోజులు సరదాగా ఎంజాయ్ చేయవచ్చు. పైగా భారీగా జీతం.. అంతకు మించిన బోనస్ లు.. ఇవన్నీ కూడా ఐటీ విభాగంలో పనిచేసే వారికి క్లౌడ్ నైన్ అనుభూతిని ఇచ్చేవి.
ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని కంపెనీలు వారంలో ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వడం లేదు. పైగా విపరీతమైన పని ఒత్తిడి పెంచుతున్నాయి. నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి. ఉద్యోగం చేయాలి కాబట్టి.. కుటుంబాన్ని సాకాలి కాబట్టి చాలామంది ఎన్ని రకాల ఒత్తిడులు ఉన్నప్పటికీ భరిస్తున్నారు. మరో అవకాశం లేక ఇబ్బంది పడుతూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంత హింస పెట్టినా సరే ఐటీ కంపెనీలకు ఉద్యోగుల మీద పగ చల్లారడం లేదు. అడ్డగోలుగా తీసిపడేస్తున్నాయి.. ఉద్యోగాల నుంచి బయటికి వెళ్లిపోండంటూ మెడ పట్టి గెంటివేస్తున్నాయి.
అందువల్లే ఐటీ పరిశ్రమ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో భారీగా తొలగింపులు కొనసాగుతున్నాయి.. లే ఆఫ్. ఎఫ్ వై అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం గడచిన ఐదు నెలల్లో దాదాపు 1.16 లక్షల మంది ఐటీ రంగ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. గత ఏడాది మే నెలలో 10, 577 మంది ఉద్యోగులను తొలగిస్తే.. ఈ సంఖ్య ఈ ఏడాది ఇప్పటికే రెట్టింపు అయింది. దాదాపు 28,889 మంది ఉద్యోగులను అన్ని కంపెనీలు తొలగించాయి. ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మెటా, పేపాల్, సిస్కో, ఇంటూ ఇట్, క్లౌడ్ ఫెయిర్, విక్స్ అనే సంస్థలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే కంపెనీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయని తెలుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోవడం.. టెక్నాలజీ ద్వారానే ఉద్యోగులు చేయాల్సిన పనిని కంపెనీలు చేయిస్తున్నాయి. దీంతో పరిస్థితులు మారిపోతున్నాయి. అందువల్లే ఉద్యోగుల అవసరం లేకుండానే కంపెనీలు మనుగడ సాగించాలని నిర్ణయానికి వచ్చాయి. టెక్నాలజీ వాడకం వల్ల ఉద్యోగుల సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల కంపెనీల మీద ఆర్థిక భారం తగ్గుతుంది. పైగా ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఉండడంతో కంపెనీలు పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. అయితే ఉద్యోగుల తొలగింపు ఇక్కడితోనే ఆగదని.. ఇంకా అది మరింత ఎక్కువగా ఉంటుందని పలు సంస్థలు చెబుతున్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే భవిష్యత్ కాలంలో మొత్తం గడ్డు పరిస్థితులే. ఒకప్పుడు పచ్చగా వెలుగొందిన ఐటీ పరిశ్రమ ఇలా మారిపోవడం నిజంగా ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో తెలియకుండా ఉంది.
