Homeఅంతర్జాతీయంIsrael Lebanon Conflict: సీజ్‌ఫైర్‌.. డోన్ట్‌కేర్‌.. లెబనాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌!

Israel Lebanon Conflict: సీజ్‌ఫైర్‌.. డోన్ట్‌కేర్‌.. లెబనాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌!

Israel Lebanon Conflict: పశ్చిమాసియాలో నెల రోజులుగా శాంతి నెలకొంది. ఇరాన్‌–అమెరికా మధ్య కుదిరిన సీజ్‌ఫైర్‌తో ఇజ్రాయెల్‌ కూడా లెబనాన్‌పై దాడులు ఆపింది. శాంతి ఒప్పందం కుదురుతుందని ట్రంప్‌ ప్రకటించిన మరుసటి రోజే అమెరికా బలగాలు ఇరాన్‌పై దాడులు చేశాయి. ఇదే అదనుగా ఇజ్రాయెల్‌ కూడా సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించి లెబనాన్‌లోని హెజ్‌బొల్లా లక్ష్యంగా దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైనట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఏప్రిల్‌ 17న∙అమలులోకి వచ్చిన సీజ్‌ఫైర్‌ ఒకవైపు ఉండగా, ఇజ్రాయెల్‌ మరోసారి లెబనాన్‌పై తీవ్ర వైమానిక దాడులు చేసింది. మే 27న దక్షిణ, తూర్పు లెబనాన్‌ ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 31 మంది (మహిళలు, పిల్లలు సహా) మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు.

గ్రౌండ్‌ ఆపరేషన్‌ విస్తృతం..
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు గ్రౌండ్‌ ఆపరేషన్స్‌ను మరింత విస్తృతం చేస్తామని ప్రకటించడం ఈ సంక్షోభాన్ని మరింత దిగజార్చే అవకాశం ఉంది. మార్చి 2, 2026 నుంచి ఇజ్రాయెల్‌–హెజ్బొల్లా మధ్య సంఘర్షణ తీవ్రరూపం దాల్చింది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు, గ్రౌండ్‌ ఆపరేషన్స్‌తో లెబనాన్‌లో వేలాది మంది ప్రభావితమయ్యారు. ఏప్రిల్‌లో అమెరికా మధ్యవర్తిత్వంతో సీజ్‌ఫైర్‌ అమలైనా, రెండు వైపులా ఉల్లంఘనలు కొనసాగాయి. లెబనాన్‌ హెల్త్‌ మినిస్ట్రీ ప్రకారం, మార్చి నుంచి ఇప్పటివరకు 3,200 మందికి పైగా మృతి చెందగా, సీజ్‌ఫైర్‌ కాలంలోనే 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు వివిధ నివేదికలు చెబుతున్నాయి.

ఇజ్రాయెల్‌ భీకర దాడులు..
ఇజ్రాయెల్‌వైపు నుంచి డ్రోన్‌లు, రాకెట్ల దాడులు కొనసాగుతున్నాయని, దానికి ప్రతిస్పందనగా ఈ దాడులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్‌ వాదన. నెతన్యాహు ‘హెజ్బొల్లాను నిర్మూలించాలి‘ అని తీవ్ర స్థాయిలో ప్రకటించడం ఈ యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగే సంకేతాలను ఇస్తోంది.

మానవీయ సంక్షోభం..
వేలాది మరణాలు, లక్షలాది వ్యక్తులు వలసలెబనాన్‌లో ఒక్క మార్చి నుంచి ఇప్పటి వరకు 3 వేలకుపైగా మృతులు, వేలాది గాయపడ్డారు. ఇది లెబనాన్‌ జనాభాలో దాదాపు ఐదో వంతు. ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, హెల్త్‌ వర్కర్లపై కూడా దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌ మాత్రం హెజ్బొల్లా లక్ష్యాలను మాత్రమే టార్గెట్‌ చేస్తున్నామని, సివిలియన్‌ మరణాలు హెజ్బొల్లా నివాసాలు, ఆయుధాలు ఉంచడం వల్ల జరుగుతున్నాయని చెబుతోంది. ఈ సంఘర్షణలో రెండు వైపులా సివిలియన్‌ మరణాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధ నియమాలు, అంతర్జాతీయ మానవ హక్కులు ఉల్లంఘనలు జరుగుతున్నాయని యునైటెడ్‌ నేషన్స్, ఇతర సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సీజ్‌ఫైర్‌ ఎందుకు విఫలమవుతోంది?
సీజ్‌ఫైర్‌ అమలులో ఉన్నప్పటికీ దాడులు కొనసాగడం రెండు వైపులా నమ్మకం లోపించడాన్ని సూచిస్తోంది. ఇజ్రాయెల్‌ తన భద్రతను ప్రధానం చేసుకుని హెజ్బొల్లా బలాలను పూర్తిగా నిర్మూలించాలని చూస్తోంది. మరోవైపు హెజ్బొల్లా (ఇరాన్‌ మద్దతు) తన ప్రభావాన్ని కాపాడుకోవడానికి దాడులు చేస్తోంది. ఇరాన్‌–ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు కూడా ఈ ప్రాంతీయ సంఘర్షణను మరింత ఇరికించాయి.

శాంతి కోసమే అంటున్న ఇజ్రాయెల్‌..
ఇజ్రాయెల్‌ తన సరిహద్దు భద్రత కోసం చర్యలు తీసుకోవడం అనివార్యమని వాదన. హెజ్బొల్లా ఆయుధాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నాశనం చేయడం ద్వారా దీర్ఘకాలిక శాంతి సాధ్యమవుతుందని ఇజ్రాయెల్‌ నమ్మకం. అయితే సీజ్‌ఫైర్‌ ఉల్లంఘనలు, అధిక సివిలియన్‌ మరణాలు మానవతా విలువలకు విరుద్ధం. లెబనాన్‌ సార్వభౌమత్వం, ప్రజల జీవనం దెబ్బతినడం దురదృష్టకరం. ఈ చర్యలు ప్రాంతీయ యుద్ధాన్ని మరింత విస్తృతం చేసే ప్రమాదం ఉంది.

తాజా దాడులు సీజ్‌ఫైర్‌ను పూర్తిగా విఫలం చేసే అవకాశాలను పెంచాయి. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా అమెరికా, యునైటెడ్‌ నేషన్స్‌ తక్షణం మధ్యవర్తిత్వం వహించి రెండు వైపులా ఉద్రిక్తతలను తగ్గించాలి. హెజ్బొల్లా ఆయుధాల నియంత్రణ, ఇజ్రాయెల్‌ సరిహద్దు భద్రత, లెబనాన్‌ సార్వభౌమత్వం – ఈ మూడింటినీ సమతుల్యం చేసే దీర్ఘకాలిక పరిష్కారం మాత్రమే ఈ ప్రాంతానికి శాంతిని తీసుకొస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version