India Russia Petrol Exports: ఉక్రెయిన్–రష్యా వార్ మూడేళ్లుగా కొనసాగుతోంది. ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్లతో రష్యాపై విరుచుకుపడుతోంది. యుద్ధం కారణంగా రష్యా ఆయిల్ను భారత్ కొనుగోలు చేస్తోంది. దీంతో రష్యాకు ఆర్థికంగా అండగా ఉంటుంది. ఈ కారణంతో భారత్పై అమెరికా సుంకాలు విధించింది. కానీ, ఇటీవలి ఇరాన్–అమెరికా వార్ కారణంగా రష్యా ఆయిల్ దిగుమతికి భారత్కు అనుమతి ఇచ్చింది. కానీ, ఉక్రెయిన్ దీర్ఘకాలిక డ్రోన్ దాడులతో రష్యా ఆయిల్ రిఫైనరీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2025 ఆగస్టు నుంచి మరింత ఉధృతమైన ఈ దాడులు 2026 మధ్య నాటికి రష్యా మొత్తం రిఫైనింగ్ సామర్థ్యంలో సుమారు 40 శాతం వరకు పనిచేయకుండా చేశాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి భారీగా తగ్గి, దేశవ్యాప్తంగా ఇంధన కొరత, రేషనింగ్, ధరల పెరుగుదల ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో ఇంధన అమ్మకాలపై నియంత్రణలు విధించారు.
భారత్ నుంచి రష్యాకు పెట్రోల్..
ఈ సంక్షోభం నేపథ్యంలో రష్యా ఇండియా నుంచి పెట్రోల్ దిగుమతులు ప్రారంభించింది. జూలై 2026 మొదటి వారంలోనే భారత్ నుంచి సముద్ర మార్గంలో కనీసం 60 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ రష్యాకు చేరింది. ఇటీవల రోస్నెఫ్ట్, గాజ్ప్రామ్ నెఫ్ట్, లుకోయిల్ వంటి ప్రముఖ రష్యన్ కంపెనీలు భారతీయ ఆయిల్ రిఫైనరీలను సంప్రదించి అదనపు సరఫరా కోరాయి. ఇది రెండు దేశాల మధ్య శక్తి వాణిజ్యంలో ఒక విలక్షణమైన మార్పుగా చెప్పవచ్చు. భారత్ రష్యా నుంచి డిస్కౌంట్లో క్రూడ్ ఆయిల్ కొని రిఫైన్ చేసి పెట్రోల్ తయారు చేస్తోంది. ఇప్పుడు ఆ పెట్రోల్ను తిరిగి రష్యాకు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది భారతీయ ఆయిల్ కంపెనీలకు అదనపు ఆదాయం కలిగించే అవకాశం కల్పిస్తోంది.
భారత్–రష్యా శక్తి సంబంధాల్లో కొత్త మలుపు..
ఈ పరిణామం ఇండియా–రష్యా సంబంధాలను మరింత బలపరుస్తోంది. భారత్ దీర్ఘకాలంగా రష్యా క్రూడ్ను డిస్కౌంట్లో కొంటూ దేశ ఇంధన భద్రతను కాపాడుకుంటోంది. ఇప్పుడు రష్యా భారత్ రిఫైనింగ్ సామర్థ్యాన్ని ఆశ్రయిస్తోంది. ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత లోతుగా చేస్తుంది. భారత్కు ఇది వ్యూహాత్మకంగా మంచి అవకాశం. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. అదనపు ఎగుమతులు లాభాలను పెంచుతాయి.
క్రూడ్ ధరల పెరుగుదల
ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. రష్యా రిఫైనింగ్ సామర్థ్యం తగ్గడం వల్ల ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరా అనిశ్చితంగా మారింది. ఇది ధరలను పైకి తీసుకెళ్తోంది. భారత్ వంటి దేశాలకు ఇది ద్వంద్వ ప్రభావం చూపుతోంది. ఒకవైపు దిగుమతి ఖర్చు పెరుగుతోంది, మరోవైపు ఎగుమతి అవకాశాలు పెరుగుతున్నాయి.
ఈ పరిణామం యుద్ధం వల్ల ఆయిల్ వాణిజ్యంలో ఎలా మార్పులు వస్తాయో చెబుతోంది. రష్యా ఒకప్పుడు ప్రపంచానికి ఇంధనం సరఫరా చేసే దేశం. ఇప్పుడు భారత్ నుంచి సహాయం కోరుతోంది. భారత్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా లాభపడుతోంది. అయితే దీర్ఘకాలికంగా రష్యా తన రిఫైనరీలను మరమ్మతు చేసుకోవడం, ప్రత్యామ్నాయ ఉత్పత్తి మార్గాలు కనుగొనడం అవసరం.
