India-Maldives: భారత్‌–మాల్దీవుల ఘర్షణ.. ఆరు నెలల్లో రిచ్ గా మారిన పొరుగు దేశం

భారత పర్యాటకులు మాల్దీవులను బహిష్కరించడంతో పొరుగున ఉన్న శ్రీలంక లబ్ధి పొందుతోంది. భారత పర్యాటకులు భారీగా శ్రీలంక వెల్తున్నారు. అక్కడ చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : May 21, 2024 11:01 am

India-Maldives Clash

Follow us on

India-Maldives: ఒక వస్తువు కోసం ఇద్దరు కొట్టుకుంటుంటే.. మూడో వాడు వచ్చి ఎగరేసుకుపోయాడట.. అన్నట్లు ఉంది భారత్, మాల్దీవుల తీరు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణంతో మూడో దేశం లాభ పడుతోంది. భారత పర్యాటకులు మాల్దీవులను బహిష్కరించడంతో పొరుగున ఉన్న శ్రీలంక లబ్ధి పొందుతోంది. భారత పర్యాటకులు భారీగా శ్రీలంక వెల్తున్నారు. అక్కడ చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు.

రెట్టింపైన పర్యాటకులు..
శ్రీలంక వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య 2022తో పోలిస్తే 2023లో దాదాపు రెట్టింపు అయింది. 2022లో 1,23,004 మంది భారతీయులు శ్రీలంక పర్యటనకు వెళ్లారు. 2023లో ఈ సంఖ్య 3,02,844కు పెరిగింది. ఏడాదిలోనే శ్రీలంక వెళ్లే పర్యాటకులు రెట్టింపు అయ్యారు. ఇక ఈ ఏడాది(2024లో) సుమారుగా 6 లక్షల మంది పర్యాటకులు శ్రీలంకకు వస్తారని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది.

ఆకట్టుకునేలా ప్రచారం..
భారత పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రచారం కూడా ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని నగరాల్లోనూ ప్రచారం చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. భారత్, మాల్దీవుల మధ్య నెలకొన్న ఉద్రిక్తత తమకు కలిసి వచ్చిందని శ్రీలంక పర్యాటక మంత్రి హరీన్‌ ఫెర్నాండో స్వయంగా ప్రకటించారు. 2030 నాటికి పర్యాటకరంగంలో అత్యధికంగా ఖర్చు చేసే దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉంటుందని తెలిపారు.

శ్రీలంకకు ఎక్కువగా..
శ్రీలంక పర్యాటక శాఖ లెక్కల ప్రకారం.. 2023లో మొత్తం 14,87,303 మంది పర్యాటకులు శ్రీలంకకు వెకేషన్‌ కోసం వెళ్లారు. అందులో 3,02,844 మంది భారతీయులే. ఇక 2023, జూలై తర్వాత నుంచి శ్రీలంక వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. జనవరిలో 13,759 మంది వెళ్లగా, ఫిబ్రవరిలో 13,714 మంది, మార్చిలో 18,959, ఏప్రిల్‌లో 19,915 మంది, మేలో 23,016 మంది జూన్‌లో 26,830 మంది, జూలైలో 23,461 మంది, ఆగస్టులో 30,593 మంది, సెప్టెంబర్‌లో 30,063, నవంబర్‌లో 28,203, డిసెంబర్‌లో 43,973 మంది భారతీయ పర్యాటకులు శ్రీలంక వెళ్లారు.