Paris Olympics 2024 : ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో సమ్మర్ ఒలింప్స్ 2024 ప్రారంభమయ్యాయి. అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో 200లకుపైగా దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఒలింపిక్స్ 125 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ నిర్వహించని విధంగా ఈసారి నిర్వహించారు. అయితే ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు ప్రాన్స్లో ఓ విధ్వంసం జరిగింది. ఇది అందరినీ ఆందోళనకు గురి చేసింది. ఫ్రాన్స్లోని హైస్పీడ్ రైల్వే వ్యస్థపై దాడిజరిగింది. దీంతో రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఫ్రాన్స్ జాతీయ రైలు ఆపరేటర్ ఎన్సీఎఫ్·దాని హై–స్పీడ్ రైలు నెట్వర్క్లో అనేక విధ్వంసక సంఘటనలు జరిగాయి. దీని కారణంగా పలు రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. ఒలింపిక్ ప్రారంభోత్సవ వేడుకకు కొన్ని గంటల ముందు ఫ్రెంచ్ రైలు ఆపరేటర్ కంపెనీ ఎస్ఎన్సీఎఫ్ ఈ మొత్తం విషయాన్ని వార్తా సంస్థ ఏఎఫ్పీకి తెలియజేసింది. ఎస్ఎన్సీఎఫ్ ఫ్రాన్స్ హై–స్పీడ్ రైలు నెట్వర్క్పై కాల్పులు జరిపినట్లు చెప్పారు. దీంతో రవాణా వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని తెలిపారు.
ఫ్రాన్స్ రైల్వే సర్వీసుపై తీవ్ర ప్రభావం
తాజా దాడితో ఫ్రాన్స్ పశ్చిమ, ఉత్తర , తూర్పు ప్రాంతాల రైల్వే లైన్లు ప్రభావితమయ్యాయి. ఈ దాడుల ప్రభావం డొమెస్టిక్ రైళ్ల పై మాత్రమే కాదు.. ఛానల్ టన్నెల్ ద్వారా వెళ్లే పొరుగు దేశాలైన బెల్జియం, లండన్ వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ విధ్వంసం నుంచి రైల్వే వ్యవస్థను సరిచేయడానికి మూడు రోజులు పడుతుందని సమాచారం.
దర్యాప్తు షురూ..
ఇదిలా ఉంటే.. రైల్వే వ్యస్థపై దాడి నేపథ్యంలో జాతీయ పోలీసుల సూచన మేరకు ఫ్రెంచ్ అధికారులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఎన్సీఎఫ్ ఈ సంఘటనలను ‘హానికరమైన చర్యలు’గా అభివర్ణించింది. ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు జరిగిన ఈ ఘటనను ఫ్రెంచ్ ప్రభుత్వ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఫ్రాన్స్లోని అనేక ప్రాంతాల్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాల్సి ఉంది.. అయితే పారిస్ ఒలింపిక్స్ నిర్వహణకు దీనికి ప్రత్యక్ష సంబంధం ఉందా అనేది ఇప్పటి వరకు స్పష్టంగా లేదు.
8 లక్షల మంది ప్రయాణానికి అంతరాయం..
ది గార్డియన్ నివేదిక ప్రకారం.. ఈ హింసపై ఫ్రాన్స క్రీడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది భయంకరమైనది చర్యగా అభివర్ణించారు. క్రీడలను లక్ష్యంగా చేసుకోవడం ఫ్రాన్స్ను లక్ష్యంగా చేసుకోవడంతో సమానమని ఆయన ఉద్ఘాటించారు. అదే సమయంలో ఫ్రాన్స్ రవాణా మంత్రి రైలు నెట్వర్క్పై ఈ దాడులను ఘోరమైన నేరంగా అభివర్ణించారు. దాదాపు 8 లక్షల మంది ప్రయాణికులు ఈ దాడితో ఇబ్బంది పడ్డారని ఎస్ఎన్సిఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జీన్ –పియర్ తెలిపారు. ఇదిలా ఉంటే దాడికి బాధ్యత వహిస్తూ ఎవరూ ప్రకటన చేయలేదు. మరోవైపు ప్రాంతీయ దళాలు జాతీయ పోలీసు, జాతీయ జెండర్మేరీ అలాగే యాంటీ టెర్రరిస్ట్ ఎస్డీఏటీ మొత్తం కమాండ్ కింద సాక్ష్యాలను సేకరిస్తున్నాయి.
సెయిన్ నది తీరంలో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు
ఇదిలా ఉంటే.. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు ఫ్రాన్స్లో అపూర్వమైన రీతిలో నిర్వహించాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం మొత్తం ఈఫిల్ టవర్, సీన్ నది సమీపంలో జరిగాయి. ఈ ఈవెంట్లో 10,500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రేక్షకులు, అతిథులు హాజరయ్యారు. ఒలింపిక్ క్రీడలు 1896లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రారంభ వేడుకలు వివిధ స్టేడియంల్లో జరిగాయి. స్టేడియం వెలుపల ఈ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే ఫ్రాన్స్ రైలు నెట్వర్క్పై జరిగిన ఈ దాడి ప్రారంభ వేడుకపై ఎలాంటి ప్రభావం చూపకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.