Donald Trump: ప్రపంచ దేశాల దిగుమతులపై టారిఫ్లతోనే ఏడాది పాలన పూర్తి చేసుకున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా భారత్కు గుడ్ న్యూస్ చెప్పారు. భారతీయ ఉత్పత్తులపై విధించిన టారిఫ్లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి కారణంగా విధించిన అదనపు సుంకాలను పూర్తిగా ఎత్తేశారు. ఇది భారతీయ ఎగుమతులకు అనుకూలంగా మారనుంది.
మోదీకి ఫోన్ చేసిన ట్రంప్..
మొన్నటి వరకు భారత్పై ట్రంప్ కక్ష సాధింపునకు దిగారు. మోదీని కూడా విమర్శించారు. భారత్ది డెడ్ ఎకానమీ అంటూ ఎద్దేవా చేశారు. కానీ భారత్ ట్రంప్ మాటలను లెక్క చేయలేదు. తన పని తాను చేసుకుంటో పోయింది. ఈ క్రమంలో ప్రపంచంలో పలు దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పూర్తయింది. దీంతో ట్రంప్లో ఆందోళన నెలకొంది. దీంతో మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్ ఆ విషయాన్ని తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో పోస్టు చేశారు. మోదీని “గొప్ప స్నేహితుడు, శక్తివంతమైన నాయకుడు” అని ప్రశంసించారు.
వెనెజువెలా ఆయిల్ కొనుగోలు..
ఇదిలా ఉంటే మోదీ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి నిలిపివేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇకపై అమెరికా, వెనెజువెలా నుంచి ఆయిల్ కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు మోదీ అంగీకరించారని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇరు దేశాల మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు.
భారత్కు ప్రయోజనాలు..
ట్రంప్ టారిఫ్లు తగ్గించడం భారతీయ వ్యాపారులకు లాభదాయకం. ఎగుమతులు పెరిగి, ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. వాణిజ్య ఒప్పందం రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని రెట్టింపు చేయవచ్చు. రష్యన్ చమురు ఆధారాలను తగ్గించి అమెరికా వైపు మళ్లించడం భారత్ శక్తి భద్రతను మెరుగుపరుస్తుంది. ఇది అంతర్జాతీయ ఒత్తిళ్లను తగ్గిస్తుంది. భారత-అమెరికా బంధాలను బలోపేతం చేస్తుంది. ఇది ట్రేడ్ వార్ భయాలను తగ్గించి, రెండు దేశాల ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. భవిష్యత్తులో మరిన్ని ఒప్పందాలు ఆశాకిరణాలు కల్పిస్తున్నాయి.