Baloch Female Suicide Bombers: పాకిస్తాన్ దేశంలోని అతిపెద్ద ప్రాంతం బలూచిస్తాన్. దేశ మొత్తం భూభాగంలో 42% ఉన్నప్పటికీ, ఇక్కడ ప్రభుత్వ నియంత్రణ బలహీనపడుతోంది. దశాబ్దాలుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) నేతృత్వంలో స్వాతంత్ర ఉద్యమం జరుగుతోంది. ఇటీవల పోరాటం తీవ్రమైంది. 48 గంటల్లో జరిగిన విస్తృత దాడులు ఇందుకు నిదర్శనం.
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం..
బీఎల్ఏ దాడుల్లో సైనిక కేంద్రాలు, భద్రతా స్థావరాలు, అధికారుల నివాసాలు ధ్వంసమయ్యాయి. సుమారు 200 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అనేక పట్టణాల్లో బీఎల్ఏ నియంత్రణ పెరిగింది, స్థానిక సైన్యం కూడా భయంతో వ్యవహారాలు నిర్వహించడంలో ఇబ్బంది పడుతోంది. ఇది పాకిస్తాన్ రక్షణ వ్యవస్థకు పెద్ద ఆందోళన.
ఉద్యమంలోకి మహిళలు..
ఇంతకు ముందు ప్రభుత్వం బీఎల్ఏ సభ్యులను బలవంతంగా అపహరించి, అన్యాయంగా చంపేసేది. కానీ ఇప్పుడు యువత, మహిళలు ఆయుధాలు పట్టి ముందుండి పోరాడుతున్నారు. ఆపరేషన్ ఘెరాఫ్లో ఆసిఫా మెంగల్ ఆత్మాహుతి దాడి చేసింది. మరొక మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని తాను ఏం చేయబోతుందో అందులో వివరించి మరీ సైనిక కేంద్రం వద్ద ఆత్మాహుతి చేసుకుంది. ఇలాంటి సంఘటనలు పాకిస్తాన్ను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
నాలుగేళ్లలో నాలుగు ఆత్మాహుతి దాడులు..
2022 ఏప్రిల్లో కరాచీ యూనివర్సిటీలో ఒక యువతి చైనా పౌరులపై ఆత్మాహుతి దాడి చేసింది. 2023లో సుమయ్యా కలంగ్రానీ కూడా ఇలాంటి చర్య తీసుకుంది. నాలుగేళ్లలో నాలుగు ఇలాంటి దాడులు జరగడం ఉద్యమం తీవ్రస్థితికి చేరుకున్నట్టు సూచిస్తోంది. మహిళలు ప్రాణత్యాగం చేస్తూ ముందుండటం పోరాటాన్ని మరింత కఠినంగా మార్చింది.
తాజా దాడులు బలూచిస్తాన్లో పాకిస్తాన్ పాలనను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. బీఎల్ఏ పట్టణాలను స్వాధీనం చేసుకునేందుకు అడుగులు వేస్తోంది. సైన్యం ఆధిపత్యాన్ని కోల్పోతుందనే ఆందోళన పెరుగుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం ఉంది, లేకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.