హుద్ హుద్ తుఫాన్ సమయంలో టీడీపీ అధినేత అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ఎంపి విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారని, ఆయన అమలు చేసిన మద్య నిషేధాన్ని వెన్నుపోటు పొడిచారని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్టును లాక్కున్నారన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుని, తుఫాను బాధితులకు అంటూ కలెక్షన్లు లాగి కోట్లు మింగేశారని పేర్కొన్నారు. ఏ లోకంలో ఉన్నారోగానీ, ఎన్టీఆర్ గారూ మీ అల్లుడి అరాచకాల మీద ఇక కొరడా తీయండని కోరారు.
విశాఖపట్నం ప్రాంతంలో సంభవించిన హుద్ హుద్ తుఫాన్ అడ్డంపెట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తల నుంచి విరాళాల రూపంలో అప్పట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ లోకి లాగేశారన్నారు. తుఫాను బాధితులకు పంచకుండా ఆ సొమ్మును పేదలకు పంచకుండా మింగేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు పేరుతో తండ్రి కొడుకుల అసాంఘిక కార్యకలాపాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.