Vizianagaram District: ప్రభుత్వ పాఠశాలల్లో( Government schools) విద్యార్థుల దండన తీరు మారుతోంది. గతంలో విద్యార్థుల్లో మార్పు కోసం ఉపాధ్యాయులు బెత్తానికి పని చెప్పేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా మారుతున్నారు. విద్యార్థులను బెత్తంతో కొడితే తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమాత్రం ఎక్కువగా దండిస్తే మీడియాకు ఎక్కుతున్న వారు కూడా ఉన్నారు కొందరైతే ఏకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అందరి ముందు తమను అవమానిస్తున్న ఉపాధ్యాయులపై విద్యార్థులు తిరుగుబాటు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు ఉపాధ్యాయులు తమకు దండన విధించుకొని.. విద్యార్థుల్లో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి ఘటనే విజయనగరం జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గం.. నంద బలగలో జరిగింది. అందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: కేసీఆర్ కట్టిన కాళేశ్వరం విలువ కాంగ్రెస్ కు ఇప్పుడు అర్థమైందా?
* రెండు రోజుల కిందట..
రెండు రోజుల కిందట అదే విజయనగరం జిల్లా( Vijayanagaram district) బొబ్బిలి నియోజకవర్గ పరిధిలోని ఓ పాఠశాలలో హెచ్ఎం విద్యార్థుల ముందు గుంజీలు తీసి సంచలనం సృష్టించారు. పెంట జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం రమణ విద్యార్థుల ప్రార్ధన సమయంలో.. చక్కగా చదవడం లేదని.. చెప్పిన మాట వినడం లేదని.. ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థుల ముందు గుంజీలు తీయడం సంచలనం గా మారింది. ఆ ఘటన మరువక ముందే.. తెర్లాం మండలం నందబలగ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ తరగతి గదిలోనే విద్యార్థుల ముందు తనకు తాను బెత్తంతో కొట్టుకొని దండన విధించుకున్నారు. విద్యార్థులు వద్దని వారించినా ఆయన వినలేదు.
* నందబలగ పాఠశాలలో..
పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు విజయ్ కుమార్( English teacher Vijay Kumar) పాఠ్యాంశాలు బోధించారు. వాటి విషయంలో సమాధానాలు రాబెట్టారు. కానీ విద్యార్థుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు ఉపాధ్యాయుడు విజయ్ కుమార్. వెంటనే బెత్తం తీసుకొని.. తన చేతిపై కొట్టుకోవడం ప్రారంభించారు. ఈ హఠాత్ పరిణామంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. సార్ వద్దంటూ వారు వేడుకున్నా ఉపాధ్యాయుడు తగ్గలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.