Vizag Kidnap Case: ఏపీలో దారుణం.. కెమెరా కోసం చంపేశాడు

విశాఖ మధురవాడలోని బక్కన్న పాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయికుమార్ పెళ్లి వేడుకలకు ఫోటోలు, వీడియోలు తీస్తుంటాడు. ఆన్లైన్ ద్వారా బుకింగ్ తీసుకొని ఈవెంట్లకు వెళుతుంటాడు.

Written By: Dharma, Updated On : March 3, 2024 6:20 pm

Vizag Kidnap Case

Follow us on

Vizag Kidnap Case: ఫోటోషూట్ లో ఆ కుర్రాడు ఎక్స్పర్ట్. అత్యాధునిక పరికరాలతో, కెమెరాతో ఫోటో షూట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ ఫోటోషూట్ కోసం విశాఖ నుంచి రావులపాలెం వెళ్లిన ఆ యువకుడి ఆచూకీ లేకుండా పోయింది.దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అనూహ్యంగా ఆ కుర్రోడు హత్యకు గురయ్యాడు.కెమెరా కోసమే ఆ కుర్రాడిని ఇద్దరి యువకులు దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టారు. ఇందుకు సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి.

విశాఖ మధురవాడలోని బక్కన్న పాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయికుమార్ పెళ్లి వేడుకలకు ఫోటోలు, వీడియోలు తీస్తుంటాడు. ఆన్లైన్ ద్వారా బుకింగ్ తీసుకొని ఈవెంట్లకు వెళుతుంటాడు. ఈ క్రమంలో పది రోజుల కిందట రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు సాయికుమార్ ను ఆశ్రయించారు. పది రోజులపాటు ఫోటోషూట్ ఉన్నట్లు చెప్పి ఫిబ్రవరి 26న సాయికుమార్ ను పిలిచారు. దీంతో తన వద్ద ఉన్న సుమారు 15 లక్షల విలువైన కెమెరా సామాగ్రితో అతడు బయలుదేరాడు. పెళ్లి వేడుకలకు ఫోటోషూట్ కోసం రావులపాలెం వెళుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే గత మూడు రోజులుగా సాయికుమార్ ఆచూకీ లేకుండా పోయింది. ఫోనుకు సైతం ఆయన స్పందించడం లేదు. దీంతో అనుమానంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర పరిణామాలు వెలుగు చూస్తాయి. సాయికుమార్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు యువకులు సాయికుమార్ ను దారుణంగా హత్య చేశారని గుర్తించారు. పెళ్లి ఈవెంట్ కోసం విశాఖ నుంచి రైలులో బయలుదేరిన సాయికుమార్ రాజమండ్రి లో దిగారు. ఇద్దరు యువకులు కారులో వచ్చి సాయికుమార్ ను తీసుకెళ్లారు. రావులపాలెం సమీపంలో అతడిని హత్య చేసి.. మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. పది లక్షల రూపాయల విలువైన కెమెరాతో పాటు ఇతర సామాగ్రిని తీసుకెళ్లిపోయారు. ఆ ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.