Chennai: జారిపడపోయిన చిన్నారి బతికింది.. ‘సోషల్ మీడియా’ దెబ్బకు తల్లి చనిపోయింది

చెన్నైలోని తిరుముల్లైవాయల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ బాల్కనీలో పడి ప్రాణాలతో బయటపడిన చిన్నారి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కరమడై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Written By: Neelambaram, Updated On : May 20, 2024 4:09 pm

Chennai

Follow us on

Chennai: సోషల్ మీడియా చేసిన తప్పు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది. తెలిసి జరిగితే నిర్లక్ష్యం తెలియకుండా జరిగితే ప్రమాదం ఇంత చిన్న లాజిక్ ను మరిచిన నెటిజన్లు ప్రమాదం అని గుర్తించకుండా పాపం ఆ తల్లిపై విమర్శలు గుప్పించారు. తల్లి మనసు తెలిసిన స్త్రీమూర్తులు కూడా నెగెటివ్ కామెంట్లకు వంత పాడడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి సూసైడ్ చేసుకుంది.

చెన్నైలోని తిరుముల్లైవాయల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ బాల్కనీలో పడి ప్రాణాలతో బయటపడిన చిన్నారి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కరమడై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాసుదేవన్ కోయంబత్తూరు జిల్లా, కరమడై పెల్లాతి ప్రాంతానికి చెందినవాడు. అతని రెండో కూతురు రమ్య. ఆమె తన భర్త వెంకటేష్, ఇద్దరు పిల్లలతో కలిసి చెన్నైలోని తిరుముల్లైవాయల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది.

ఏప్రిల్ 28న వారి 7 నెలల పాప ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి పడిపోవడంతో స్థానికులు చిన్నారిని సురక్షితంగా రక్షించారు. దీని కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయితే, దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కలకలం రేగింది.

దీంతో పలువురు సోషల్ మీడియాలో చిన్నారి తల్లిపై విమర్శలు గుప్పించారు. ‘బిడ్డను సరిగా చూసుకోవడం చాతకాదా?’ అనే విమర్శలు వచ్చాయి. దీంతో చిన్నారి తల్లి రమ్య తీవ్ర ఒత్తిడికి గురైనట్లు సమాచారం.

రమ్య తన భర్త, బిడ్డతో సహా కోయంబత్తూరు జిల్లాలోని తమ స్వగ్రామం కరమడైలోని పుట్టింటికి వచ్చింది. కొన్ని వారాలుగా కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే నివాసం ఉంటుంది. ఈ సందర్భంలో రమ్య తల్లిదండ్రులు ఫంక్షన్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రమ్య సూసైడ్ చేసుకుంది.

ఫంక్షన్ ముగించుకొని తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా రమ్య విగతజీవిగా కనిపించింది. వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఆసుపత్రిలో ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కారమడై పోలీసులు రమ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం మెట్టుపాళయంకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.