Sadhguru Vasudev: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు ఏమైంది? ఆయన భక్తుల ఆందోళనకు కారణమేంటి?

వాసుదేవ్ శివరాత్రి కంటే ముందే తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయన శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి ప్రముఖులు రావడంతో వారితో ఆడి పాడారు. అనంతరం కొద్ది రోజులకే ఆయన తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 21, 2024 10:41 am

Sadhguru Vasudev

Follow us on

Sadhguru Vasudev: ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా, save soil ఉద్యమకారుడిగా జగ్గి వాసు దేవ్ సుపరిచితులు. తమిళనాడులోని ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ప్రతి ఏడాది శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు హాజరవుతారు. శివుడి పాటలకు.. వాసుదేవ్ లయబద్ధంగా ఆడుతారు. సుమారు 80 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహంగా కనిపిస్తారు. శివుడి గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి అలవోకగా ప్రసంగిస్తారు. నదుల పరిరక్షణ కోసం ఆ మధ్య ఆయన యాత్ర కూడా నిర్వహించారు. అలాంటి వాసుదేవ్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని.. ఆయన పరిస్థితి బాగోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని బలపరిచే విధంగా వాసుదేవ్ ఆసుపత్రి బెడ్ పై పడుకొని ఉండి చేసిన వీడియో కలకలం రేపుతోంది.

వాసుదేవ్ శివరాత్రి కంటే ముందే తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయన శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి ప్రముఖులు రావడంతో వారితో ఆడి పాడారు. అనంతరం కొద్ది రోజులకే ఆయన తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. అచేతన స్థితిలోకి పడిపోవడంతో సహాయకులు ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన మెదడులో రక్తస్రావం అవుతున్నట్టు గుర్తించారు. మెదడులో కొంత భాగం వాపునకు గురైనట్టు నిర్ధారించారు. అనంతరం వైద్యుల బృందం ఆధ్వర్యంలో ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు.. “వాసుదేవ్ నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అది ఆయనకు ప్రాణాంతకంగా మారింది. మెదడులో అంతర్గత రక్తస్రావం జరిగింది. వాపు కూడా ఏర్పడింది. అయినప్పటికీ ఆయన రోజువారి కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఇటీవల తలనొప్పి తీవ్రం కావడంతో నాకు ఫోన్ చేశారు. అప్పుడే సమస్య తీవ్రంగా ఉందని నాకు అర్థమైంది. ఆయన సహాయకులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ముందుగా ఆయనకు ఎమ్మారై స్కానింగ్ తీశాం. అందులో మెదడులో వాపు, అంతర్గతంగా రక్తస్రావం జరుగుతున్నట్టు గుర్తించాం. అనంతరం శస్త్ర చికిత్స నిర్వహించాం. ఆయనకు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసాం. ప్రస్తుతం కోరుకుంటున్నారని” ఢిల్లీ అపోలో ఆసుపత్రి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ వినీత్ సూరి ప్రకటించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి వాసుదేవ్ కు తీవ్రమైన తలనొప్పి ఉన్నప్పటికీ.. ఢిల్లీలోని కొన్ని సమావేశాలకు, ఓ వేడుకకు హాజరయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెబుతున్నప్పటికీ.. భక్తులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. శస్త్ర చికిత్స తర్వాత వాసుదేవ్ ఆసుపత్రి బెడ్ పైనుంచి మాట్లాడారు. ఆ వీడియోను తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయిందని, ఆరోగ్యం బాగానే ఉందని ప్రకటించారు.