
ICC World Cup 2023: ఈ ఏడాది చివరన జరుగనున్న 2023 వన్డే ప్రపంచకప్ భారత్ వేదికగా ఆడబోమని ప్రకటించిన పాకిస్థాన్ ఇప్పుడు మాట మార్చినట్లు తెలుస్తోంది. భారత్లో ఆడతాం కానీ, ఆ కండీషన్స్ మాత్రం వర్తిస్తాయని తెలిపినట్లు సమాచారం. చెన్నై, కోల్కతాలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు తమ మ్యాచ్లలో ఎక్కువ ఆడేందుకు ఇష్టపడుతున్నట్లు ఐసీసీ ఉన్నతాధికారులతో పాక్ క్రికెట్ బోర్డు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ రెండు నగరాలు తమ జట్టుకు సురక్షితమని భావిస్తున్నట్లుల తెలిసింది.
అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్..
2023 వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ అక్టోబర్ 5 న ప్రారంభం కానుంది. ఫైనల్తో సహా 46 మ్యాచ్లు జరగనున్నాయి. భారతదేశంలోని 12 నగరాల్లో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ఇండోర్, రాజ్కోట్ మరియు ముంబైలలో మ్యాచ్లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ 2023 నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఇండియాకు రామన్న పాక్..
గతంలో పాకిస్థాన్ జట్టు తన ప్రపంచ కప్ 2023 మ్యాచ్లను భారత్లో కాకుండా బంగ్లాదేశ్లో ఆడతామని ప్రకటించింది. తటస్థ వేదికలపైనే ఆడతామని తెలిపింది. అలాగే ఆసియా కప్ పాకిస్థాన్లో జరుగుతున్న దృష్ట్యా భారత్ కూడా పాకిస్థాన్ వెళ్లకుండా బంగ్లాదేశ్లో ఆడాలని భావించింది. బహుశా వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం పాక్ భారత్కు వస్తే భారత్ కూడా పాకిస్తాన్లో ఆడేందుకు ఆవకాశం ఉంది.

2011లో ఇండియాతో తలపడ్డ దాయాది జట్లు..
కాగా 2011 ప్రపంచ కప్ సందర్భంగా, మొహాలీలో భారత్తో పాకిస్థాన్ జట్టు సెమీ ఫైనల్లో తలపడ్డాయి. అప్పట్లో క్రికెట్ అభిమానుల కోసం వాఘా బోర్డర్ గుండా ప్రయాణించేందుకు రవాణా సౌకర్యం కల్పించారు. అయితే, తాజాగా బీసీసీఐ ఖరారు చేసిన 12 వేదికల్లో మొహాలీ పేరు లేదు. మరి పాకిస్థాన్ కండీషన్స్కు ఐసీసీ అంగీకరిస్తుందా.. ఐసీసీఐ అంగీకరించినా బీసీసీఐ ఏమంటుంది అన్న చర్చ జరుగుతోంది. క్రికెట్ అభిమానులు మాత్రం భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.