
Northeast Assembly Election Results 2023: ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పూర్తి ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం త్రిపుర, నాగాలాండ్ లో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేఘాలయలో మాత్రం ఎన్పీపీ హవా కొనసాగుతోంది. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సంగ్మా నేతృతంలోని ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
త్రిపుర
భారతీయ జనతా పార్టీ కూటమి మూడు చోట్ల విజయం సాధించింది. మరో 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 31 సీట్ల మార్కును దాటేసింది. ఇక ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాల కూటమి 14 చోట్ల ముందంజలో ఉంది. తిప్రా మేథ్రా పార్టీ( టీఎంపీ) ఒకచోట విజయం సాధించింది. మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
నాగాలాండ్
నాగాలాండ్ లో భారతీయ జనతా పార్టీ, ఎన్డీపీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. ఇప్పటివరకు ఈ కూటమి అయిదు చోట్ల విజయం సాధించింది. మరో 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్ పి ఎఫ్ 2, కాంగ్రెస్ మూడు, ఎన్పీపీ 3 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు ఒక స్థానంలో గెలుపొంది.. 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

మేఘాలయ
ఇప్పటివరకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. అయితే ఇక్కడ సీఎం సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ దూకుడుగా ఉంది. ఇప్పటివరకు ఈ పార్టీ నాలుగు చోట్ల గెలుపొందింది. 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ 7, భారతీయ జనతా పార్టీ 4, కాంగ్రెస్ 4, ఇతరులు 17 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.. వాటిల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ 31 సీట్లు.. అయితే మేఘాలయ మినహా నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన సీట్లను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. ఓట్ల లెక్కింపులో అదే ట్రెండ్ కనిపిస్తోంది.