Anand Mahindra: ఆనంద్ మహీంద్రా ను ఆకట్టుకున్న 3B.. ఇంతకీ దీని ప్రత్యేకతలేంటంటే..?

ఊపిరి సలపని పని ఒత్తిడి ఉన్నప్పటికీ.. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటారు. కొత్త కొత్త ఆవిష్కరణలను తనను అనుసరించే వారితో పంచుకుంటారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 16, 2024 12:15 pm

Anand Mahindra

Follow us on

Anand Mahindra: మనిషికి సైకిల్ తో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది . కాలానికి అనుగుణంగా అనేక మార్పులు సైకిల్ లో చోటు చేసుకుంటున్నాయి.. ఒకప్పుడు అట్లాస్ సైకిల్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత అనేక కంపెనీలు ఈ రంగంలోకి వచ్చాయి. కొత్త కొత్త నమూనాలలో సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.. నేటి స్పీడ్ యుగంలోనూ సైకిల్ వ్యాయామ సాధనంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా యువతరం సైకిల్ తొక్కేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సైకిల్ ఎన్ని రకాలుగా మారినా సీటింగ్ మాత్రం అలానే ఉంటున్నది. దానివల్ల కొంతమంది ఇబ్బంది పడుతూనే సైకిల్ తొక్కుతుంటారు. మరికొందరేమో ఆ సీటింగ్ కు మెత్తని కూషన్ ఏర్పాటు చేసుకుంటారు. అయితే రొటీన్ గా సీటింగ్ మీద కూర్చొని సైక్లింగ్ చేయడం వల్ల పిరుదుల భాగంలో నొప్పి ఏర్పడుతుందట. ఒక్కోసారి అలానే సైకిల్ తొక్కుతుంటే ఇబ్బందిగా కూడా ఉంటుందట. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపించారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.

ఊపిరి సలపని పని ఒత్తిడి ఉన్నప్పటికీ.. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటారు. కొత్త కొత్త ఆవిష్కరణలను తనను అనుసరించే వారితో పంచుకుంటారు. ఒక్కోసారి వారు ఇచ్చే సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఆయన ఒక సైక్లింగ్ వీడియోను తనను అనుసరించే వారితో పంచుకున్నారు. ఇంతకీ అందులో ఏముందంటే.. ఆ మోడల్ సైకిల్ చూడ్డానికి మామూలుగానే ఉంది. అయితే అందులో సీట్ రెండు భాగాలుగా విభజనకు గురైంది. ఒక భాగం ముందుకు కదులుతుంటే, మరొక భాగం వెనక్కి కదులుతోంది. అలా కూర్చుని సైక్లింగ్ చేసినప్పుడు.. వెనుక భాగంలో సమాంతర కదలికలు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల పిరుదుల భాగానికి సమర్థవంతమైన ఎక్సర్ సైజ్ లభిస్తోందని మహీంద్రా పేర్కొన్నారు. “తెలివైన ఆవిష్కరణలు వెనుక చూపులో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దీనిని 3B అని పిలవాలి. దీనిని Best bike for your bottom అని”సంబోధించాలని ఆనంద్ రాస్కొచ్చారు.

ఆనంద్ ట్వీట్ చేసిన వీడియోలో సైకిళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఆ సైకిళ్లు తొక్కేవారు పాశ్చాత్యుల లాగా దర్శనమిస్తున్నారు. వారు తొక్కుతున్న సైకిల్ పై సీటింగ్ విభిన్నంగా ఉంది. రెండు భాగాలుగా విడిపోయిన సీట్.. ఒకటి ముందుకు వెళ్తుంటే.. మరొకటి వెనక్కి వస్తోంది. దీనివల్ల పిరుదుల భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుందట. నడుము భాగానికి సరైన వ్యాయామం లభిస్తుందట. ఇలా సైక్లింగ్ చేయడం వల్ల చెడు కొవ్వు కరిగిపోతుందట. అయితే ఆనంద్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఆనంద్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది మహీంద్రా కంపెనీ నుంచి ఈ ఉత్పత్తిని మేము ఆశించవచ్చా? అని ఆనంద్ ను అడిగారు. దీనికి ఔనని కాని, కాదని కాని ఆనంద్ సమాధానం చెప్పలేదు.