Tarakaratna : తారకరత్న హెల్త్ గురించి ఆందోళన కొనసాగుతోంది. మూడు వారాలుగా ఐసీయూలో ఆయనకు చికిత్స జరుగుతుంది. తారకరత్న కోమాలోనే ఉన్నారు. వైద్యులు ఆయన్ని స్పృహలోకి తెచ్చేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. తారకరత్న మెదడులో పై భాగం దెబ్బతింది. రక్త ప్రసరణ లేక వాపు ఏర్పడింది. అలాగే నీరు చేరినట్లు వైద్యులు గుర్తించారు. విదేశాల నుండి న్యూరో ఎక్స్పర్ట్స్ ని పిలిపించారు. మొదట విదేశాలకు తీసుకెళ్దామనుకున్నారు. అది సేఫ్ కాదని వైద్యులనే బెంగుళూరుకి పిలిపించారు. చాలా రోజులుగా మెదడు పనితీరు మెరుగుపరిచేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు.
కాగా నేడు తారకరత్న మెదడుకు పరీక్షలు నిర్వహించారు. ఆయన బ్రెయిన్ స్కాన్ చేయడం జరిగింది. ఈ పరీక్షల్లో కీలక విషయాలు బయటపడినట్లు సమాచారం. తాజా పరీక్షల ప్రకారం తారకరత్న హెల్త్ కండిషన్ ఏమిటనేది తేల్చనున్నారు. ఈ క్రమంలో నారాయణ హృదయాలయ వైద్యులు బులెటిన్ విడుదల చేసే అవకాశం కలదని సమాచారం. డాక్టర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారంటూ ప్రచారం జరిగింది.
గురువారం పరీక్షలు నిర్వహించిన తరుణంలో బులెటిన్ విడుదల చేస్తారన్న విశ్వాసం అభిమానులు వ్యక్తపరుస్తున్నారు.గత రెండు వారాలుగా తారకరత్న ఆరోగ్యం మీద ఎలాంటి సమాచారం లేదు. కుటుంబ సభ్యులు కూడా స్పందించడం లేదు. ఈ పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం తారకరత్న ప్రధాన అవయవాల పనితీరు మెరుగైంది. సాధారణ స్థితికి వచ్చాయి. మెదడులో మాత్రమే సమస్య నెలకొంది. తారకరత్న తిరిగి కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. బాలయ్య ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
తారకరత్న జనవరి 27న అస్వస్థతకు గురయ్యారు. ఆయన లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాత్ర మొదలైన కాసేపటికే కుప్పకూలిపోయారు. తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురైనట్లు వైద్యులు గుర్తించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల తారకరత్న తన రాజకీయ ప్రవేశం ప్రకటించారు. టీడీపీ తరపున క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. అవకాశం వస్తే ఏపీ నుండి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడించారు. అందులో భాగంగానే తారకరత్న యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు.