
Karimnagar : కొంతమంది ఖాఖీల తీరు ఆ డిపార్ట్మంట్కు మాయని మచ్చగా మారుతోంది. ముఖ్యంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల వ్యవహారం తరచూ వివాదాస్పదమవుతోంది. భూదందాల్లో తలదూర్చడం, సెటిల్మెంట్లు చేయడం, ఫైనాన్స్లు నిర్వహించడం ఇలా అనేక ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా ఇంటెలిజెన్స్ సీఐ వేదింపుతు భరించలేక కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన ఓ రియల్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు పది పేజీల సూసైడ్ లేఖను కూడా రాశాడు. ‘నా టైమ్ బాగోలేదు.. నేనెవరికీ అన్యాయం చేయలేదు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ సీఐ గోపీకృష్ణ సార్ వల్లే నేను చనిపోతున్నా.. సీఐ సారు కొన్న ప్లాట్ అమ్ముడుపోవట్లేదు. అని పేర్కొన్నాడు.
కరీంనగర్లో ఘటన..
తాను కొన్న భూమిని విక్రయించాలని కరీంనగర్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ సీఐ గోపీకృష్ణ తనను పదేపదే బెదిరిస్తున్నారంటూ కరీంనగర్కు చెందిన బొడిగె శంబయ్య అలియాస్ శ్యామ్(55) ఆత్మహత్య చేసుకున్నాడు. గోపీకృష్ణ కారణంగానే తాను చనిపోతున్నట్లు శ్యామ్ పది పేజీల లేఖ రాశారు. చొప్పదండి సీఐ రవీందర్, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలో శ్యామ్ భూముల క్రయవిక్రయాల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటారు. కరీంనగర్లోని విద్యారణ్యపురిలో అద్దె ఇంట్లో భార్యతో కలిసి నివసిస్తున్నారు. వీరి కుమారుడు సంజయ్(బిట్టు), కుమార్తె కావ్య హైదరాబాద్లో హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు.
భూమి కొనుగోలు చేసిన సీఐ..
కరీంనగర్ బ్యాంకు కాలనీలో నివసిస్తున్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ సీఐ కురికాల గోపీకృష్ణ భూపాలపట్నంలో 8 నెలల కిందట శ్యామ్ మధ్యవర్తిత్వంతో 20 గుంటల భూమిని రూ.50 లక్షలకు కొనుగోలు చేశారు. అయిదారు నెలల్లో రూ.10 లక్షలు లాభం వచ్చేలా విక్రయిస్తానని గోపీకృష్ణకు శ్యామ్ చెప్పారు. కానీ భూమిని విక్రయించలేకపోవడంతో సీఐ గోపీకృష్ణ ఒత్తిడి చేశారు. తనకు భూమిని అమ్మిపెట్టడంతోపాటు అదనంగా రూ.10 లక్షల లాభం ఇవ్వాల్సిందేనని సీఐ పట్టుబట్టడంతో శ్యామ్ రూ.3 లక్షలు అప్పు చేసి ఆయనకు చెల్లించారు. తన బావ పేరిట భూమి కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
భూమి అమ్మాలని వేదింపులు..
భూమి విక్రయం విషయంలో సీఐ గోపీకృష్ణ వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. సీఐ సారు కొన్న ప్లాట్ అమ్ముడుపోవట్లేదని తెలిపాడు. ఆయన విషయంలో భయమేస్తోందని పేర్కొన్నాడు. నేను కేవలం ప్లాట్ అమ్మి రూ.10 లక్షల లాభం చూపిస్తానని చెప్పానని. కానీ అమ్ముడు పోనిది 10 లక్షలు ఎలా తేవాలి. రోజూ బతికి చచ్చేకంటే.. ఒకేసారి చచ్చిపోదామనుకుంటున్నా అని వెల్లడించాడు.. గోపీకృష్ణ సార్ వల్ల నా కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది. కావాలంటే నా ఫోన్లో రికార్డులు చెక్ చేయండి అని కోరాడు. ‘మొత్తం విషయం బాలాజీ సార్కు తెలుసు. సారీ.. సుజాతా.. నేను నీకు అన్యాయం చేస్తున్నా బిట్టు, కావ్యలను చూసుకో. ధైర్యంగా ఉండు. నాకు యముడిలాగా గోపీ సారు తగిలిండు.. నన్ను బతకనివ్వడు.. అందుకే చనిపోతున్న. అని వివరించాడు.
రూ.10 లక్షల ఇస్తానని ఒప్పంద పత్రం..
భూమి విక్రయించడంతోపాటు జాప్యానికి రూ.10 లక్షలు అదనంగా చెల్లిస్తానని శ్యామ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో గోపీకృష్ణకు ఒప్పంద పత్రం రాసిచ్చాడు. గురువారం గోపీకృష్ణ ఫోన్ చేసి తీవ్రంగా మాట్లాడడంతో కుంగిపోయిన శ్యామ్ శుక్రవారం మధ్యాహ్నం భూపాలపట్నం వెళ్తున్నానని బయలుదేరారు. అక్కడి సొంత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నువ్వు సస్తే నాకేమైతది.!
‘నువ్వు సచ్చిపోతే సచ్చిపో.. నాకేమైతది! నేను వచ్చి దండ వేసిపోత.. నేనే పురుగుల మందు ఇస్త.. నీ భార్య పిల్లలే బిచ్చమెత్తుకుంటరు. నువ్వు పోతే నీ ఇల్లును జప్తు చేసుకుంట.’ అంటూ శ్యామ్తో గోపీకృష్ణ ఫోన్ సంభాషణలు పోలీసులకు లభించాయి. 30 నిమిషాల నిడివి ఉన్న మరో సంభాషణలో సీఐతోపాటు మరో మధ్యవర్తి బాలాజీ మాటలు కూడా వినిపించాయి. ‘పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్న సార్.. అమ్మకానికి పార్టీలు రావడం లేదు. కాల్మొక్త సారూ.. అమ్ముడు పోకపోతే చనిపోదామనుకుంటున్న’.. అని శ్యామ్ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ‘చొప్పదండి సీఐ.. నా జూనియర్. నీ బొక్కలు ఇరగ్గొడ్తడు. సచ్చిపో ఏమైతది.. సచ్చినా మనశ్శాంతి లేకుండా చేస్తా. కొంత టైం అయినా తీసుకుని అమ్మిపెట్టు’ అన్న సీఐ మాటలున్నాయి.