
Japan: జపాన్.. ఉత్పత్తి, ఉత్పాదకత, సాంకేతికత, శారీరక శ్రమలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతోంది. జపాన్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది బుల్లెట్ రైలు. టెక్నాలజీలో దూసుకుపోతున్న జపాన్.. జనాభా విషయంలో డేంజర్ జోన్లోకి వెళ్తోంది. కొంతకాలంగా జననాల రేటు గణనీయంగా పడిపోతోంది. గతేడాది కూడా జనాభా భారీగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది. దీనిపై ఆ దేశ పాలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనన, మరణాలకు సంబంధించి గతేడాది నివేదికలు ఇటీవల వెల్లడైన నేపథ్యంలో జననాల రేటు క్షీణించడాన్ని నిరోధించకుంటే జపాన్ అదృశ్యమవుతుందని ప్రధానమంత్రి సలహాదారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పడిపోతున్న జనన రేటు..
జననాల రేటుకు సంబంధించి జపాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 28న ఓ నివేదిక విడుదల చేసింది. గతేడాదిలో జననాల సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గిపోయినట్లు అందులో పేర్కొంది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన జపాన్ ప్రధానమంత్రి సలహాదారు మసాకో మోరీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇదే పరిస్థితి కొనసాగితే.. దేశం అదృశ్యమవుతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం కనుమరుగయ్యే దశలో ఉండటం ప్రజలకు ఎంతో హాని కలిగించే అంశమని.. ఎంతో మంది చిన్నారులను భవిష్యత్తులో ఈ సమస్య వేధిస్తుందని పేర్కొన్నారు.
మరణాలే అధికం..
జపాన్లో గతేడాది జననాల సంఖ్య కంటే మరణాల సంఖ్య దాదాపు రెట్టింపుగా నమోదైంది. ఆ సంవత్సరం 8 లక్షల జననాలు నమోదవగా, మరణాలు అంతకు రెట్టిపు (15.8లక్షలు) నమోదయ్యాయి. 2008లో జపాన్ జనాభా 12.8 కోట్లుగా ఉండగా ప్రస్తుతం 12.4 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో 65 ఏళ్ల వయసు కలిగిన జనాభా కూడా 29 శాతానికి పైగా పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడైంది.

సవాళ్ల ముప్పు..
కొంతకాలంగా జపాన్ జనాభా క్రమంగా క్షీణించడం కాకుండా.. అత్యంత వేగంగా పడిపోతున్నట్లు ప్రధానమంత్రి సలహాదారు మసాకో మోరీ వెల్లడించారు. ఈ భారీ క్షీణత ఇప్పుడు పుట్టే పిలల్లకు భవిష్యత్తులో సమస్యలకు కారణమవుతుందన్నారు. దీనిని అడ్డుకోకపోతే సామాజిక భద్రతా వ్యవస్థ కుప్పకూలుతుందని.. పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటితోపాటు భద్రతా బలగాల నియామకాలకూ ఈ పరిణామాలు తీవ్ర ఆటంకం కలిగిస్తాయని తెలిపారు.
జనాభా క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు జపాన్ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకుచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రణాళిక ఏమేరకు పత్ఫలితాలిస్తుందో చూడాలి.