Aanvi kamdar Death : మీ రీల్స్ పిచ్చి తగలెయ్య.. మరో యువతి బలి.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు కదా..

ముంబై నగరానికి చెందిన అన్వి కామార్(27) ట్రావెల్ ఇన్ ఫ్లూయన్సర్ . సోషల్ మీడియాలో ఆమెను రెండు లక్షల మంది అనుసరిస్తున్నారు. పలు ప్రాంతాలలో పర్యటిస్తూ, అక్కడికి సంబంధించిన విశేషాలను అన్వి వెల్లడిస్తూ ట్రావెల్ ఇన్ ఫ్లూ యెన్సర్ గా మారింది. అన్వి రాయగడ్ ప్రాంతంలోని కుంబే జలపాతానికి వెళ్ళింది. అక్కడ లోయ అంచులో నిలబడి రీల్స్ చేస్తోంది. వర్షాలకు ఆమె నిలబడిన రాయికి పాకుడు పట్టింది

Written By: Bhaskar, Updated On : July 18, 2024 1:27 pm
Follow us on

Aanvi kamdar Death  : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలామంది ఓవర్ నైట్ లో సెలబ్రిటీలు కావాలని తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగా రకరకాల విన్యాసాలు చేస్తున్నారు.. అయితే అవి శృతిమించి ప్రాణాల మీదకి తేస్తున్నాయి. కొందరైతే జైళ్లకు కూడా వెళ్తున్నారు.

మహారాష్ట్రలో యువతి..

ఇటీవల ఓ యువతి తన స్నేహితుడితో కలిసి మహారాష్ట్ర వెళ్ళింది. అక్కడ ఓ కొండపైన రీల్స్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే కారు డ్రైవ్ చేసుకుంటూ రీల్స్ చేయాలనే ఆమె ప్రయత్నం బెడిసి కొట్టింది. కారు కొండ నుంచి కిందకి దూసుకు రావడంతో ఒక్కసారిగా ఆమె లోయలో పడిపోయి కన్ను మూసింది.

కర్ణాటకలోనూ..

అంతకుముందు కర్ణాటకలో కూడా ఓ యువకుడు జలపాతం వద్ద రీల్స్ చేయబోయి.. లోయలో పడి చనిపోయాడు.. లోయ చివరి అంచుకు వెళ్లి అతడు రీల్స్ చేయడం వల్లే ఆ ప్రమాదం జరిగింది. అతడు చనిపోయినప్పుడు ఆ దృశ్యాలు మొత్తం అతడి ఫోన్ లో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ఆ లోయ వద్ద కర్ణాటక ప్రభుత్వం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది.

ఇటీవల తిరుపతిలో కొంతమంది యువకులు రీల్స్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. సెల్ ఫోన్ తో హడావిడి చేస్తుండగా.. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో కనిపించడంతో తిరుపతి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించారు. ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.

ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావాలని చాలామంది భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు తిక్క తిక్క పనులు చేస్తున్నారు. అవి కాస్త తిరగబడి ప్రాణాల మీదికి తీస్తున్నాయి.

రీల్ చేస్తూ 27 సంవత్సరాల యువతి..

ముంబై నగరానికి చెందిన అన్వి కామార్(27) ట్రావెల్ ఇన్ ఫ్లూయన్సర్ . సోషల్ మీడియాలో ఆమెను రెండు లక్షల మంది అనుసరిస్తున్నారు. పలు ప్రాంతాలలో పర్యటిస్తూ, అక్కడికి సంబంధించిన విశేషాలను అన్వి వెల్లడిస్తూ ట్రావెల్ ఇన్ ఫ్లూ యెన్సర్ గా మారింది. అన్వి రాయగడ్ ప్రాంతంలోని కుంబే జలపాతానికి వెళ్ళింది. అక్కడ లోయ అంచులో నిలబడి రీల్స్ చేస్తోంది. వర్షాలకు ఆమె నిలబడిన రాయికి పాకుడు పట్టింది. దీంతో ఆమె కాలు జారడంతో 300 అడుగుల లోయలో పడిపోయింది. పోలీసులకు సమాచారం తెలియడంతో వారు ఫైర్ సిబ్బంది సహాయంతో అక్కడికి వెళ్లారు. 6 గంటలపాటు కష్టపడి అన్ని బయటికి తీసుకొచ్చారు. స్థానికంగా ఒక ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేర్చిన కాసేపటికి అన్వి కన్ను మూసింది.

ఇటీవల కురిసిన వర్షాలకు కుంబే జలపాతం జోరుగా ప్రవహిస్తోంది. చుట్టూ కొండలు, వాటిపై అద్భుతమైన వృక్షాలతో ఆ ప్రాంతం శోభాయమానంగా కనిపిస్తోంది. అయితే ఆ ప్రాంతానికి సంబంధించి వివరాలను అందించేందుకు అన్వి అక్కడికి వెళ్లింది. ఆ తర్వాత రీల్స్ చేయడం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో అక్కడ ప్రసిద్ధి పొందిన ఒక లోయ గురించి వివరిస్తుండగా.. కాలుజారి అందులో పడింది. 300 అడుగుల లోతులో ఉన్న లోయలో పడటంతో.. అన్వి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను పోలీసులు, ఫైర్ సిబ్బంది కాపాడారు. కానీ చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఆమె మరణ వార్త సోషల్ మీడియాలో దావానం లాగా వ్యాపించింది. ఫలితంగా పలువురు నెటిజెన్లు అన్వి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ చేస్తూ చనిపోవడం బాధాకరమని వాపోతున్నారు. ఆమెకు సద్గతి ప్రాప్తించాలని.. ఈ దుఃఖ సమయంలో ఆమె కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కామెంట్స్ చేస్తున్నారు.