Mumbai Indians Captaincy: కోరి తెచ్చుకున్న మొగుడు.. సిగ తరిగాడట.. ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి కూడా అలానే ఉంది. ఐదుసార్లు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను పక్కన పెట్టి.. హార్దిక్ పాండ్యాను 2024లో ముంబై మేనేజ్మెంట్ సారధిగా తెచ్చుకుంది. అంతకు ముందు గుజరాత్ జట్టుకు ఒకసారి ట్రోఫీని.. మరోసారి రన్నర్ అప్ గా నిలిపిన హార్దిక్ పాండ్యా.. ముంబై జట్టుకు కూడా ట్రోఫీని అందిస్తాడని మేనేజ్మెంట్ నమ్మింది. కానీ మేనేజ్మెంట్ నమ్మకాన్ని అతడు వమ్ము చేసుకుంటూ వస్తున్నాడు.
2024 సీజన్లో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 2025లో టాప్ ఫోర్ లో నిలిచింది. ఈ సీజన్లో మాత్రం దారుణమైన ఆట తీరు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాలో మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. ఇటీవల జరిగిన మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ ముంబై జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ తో ఆదుకున్నాడు. తద్వారా ముంబై జట్టు విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచ్ కు కూడా హార్దిక్ పాండ్యా దూరమవుతున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల సూర్యకుమార్ యాదవ్ కూడా దూరంగా ఉండాల్సి వస్తోంది. దీంతో జట్టుపగ్గాలు రోహిత్ శర్మ చేతిలోకి వెళ్తాయని చర్చ జరుగుతుంది.
జాతీయ మీడియాలో మాత్రం మేనేజ్మెంట్ అప్రోచ్ అయినప్పటికీ రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడానికి సుముఖంగా లేడని తెలిసింది. దీంతో సారధి కోసం మేనేజ్మెంట్ అన్వేషణ మొదలుపెట్టిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో కెప్టెన్సీ ని రోహిత్ శర్మ తీసుకుంటే బాగుంటుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అతని నాయకత్వంలో ముంబై జట్టు విజయాల బాట పడుతుందని.. ఐపీఎల్ లో సత్తా చూపిస్తుందని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అభిమానులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గాయం వల్ల రోహిత్ శర్మ ఆమధ్య కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. వైద్యుల సిఫారసు మేరకు చికిత్స పొందాడు. అనంతరం పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించిన తర్వాత మైదానంలోకి వచ్చాడు. తొలి మ్యాచ్ లోనే మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇప్పుడు అదే ఫామ్ కనుక రోహిత్ కంటిన్యూ చేస్తే ముంబై జట్టుకు తిరుగులేని స్థాయి లభిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ముంబై జట్టు భారీ విజయాలు సాధిస్తే.. ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశాలు ఉంటాయని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.