Revanth Reddy vs Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ ఎలక్షన్స్ కు సంబంధించిన ప్రచారం ముగిసింది. నాయకులు హోరాహోరీగా ప్రచారం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున అన్ని బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఎన్నికల జరుగుతున్న ప్రాంతాలలో ఆయన భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాలకు వరాలు ప్రకటించారు. ముఖ్యంగా కెసిఆర్ కుటుంబం మీద.. తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈసారి బిజెపిని కూడా రేవంత్ రెడ్డి వదిలిపెట్టలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏకంగా కేసీఆర్ దత్తపుత్రుడు అని రేవంత్ రెడ్డి విమర్శించడం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది.
రేవంత్ రెడ్డి దూకుడు అలా ఉంటే.. మేము తక్కువ కాదు అన్నట్టుగా గులాబీ పార్టీ నుంచి హరీష్ రావు.. కేటీఆర్ విమర్శలు మొదలుపెట్టారు. దక్షిణ తెలంగాణలో.. ఉత్తర తెలంగాణలో కీలక ప్రాంతాలలో హరీష్ రావు.. కేటీఆర్ సుడిగాలి మాదిరిగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు. కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ” మమ్మల్ని తిట్టినా పర్వాలేదు.. తెలంగాణ తెచ్చిన వ్యక్తిని దూషిస్తావా.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టం. పొట్టోడి సంగతి తేలుస్తా” అని కేటీఆర్ విమర్శించారు.
ఇక హరీష్ రావు ఒక అడుగు ముందుకేసి.. ఉమ్మడి మెదక్ జిల్లాలో అడుగుపెట్టే దమ్ము రేవంత్ రెడ్డి లేదని సవాల్ విసిరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నది హరీష్ రావు కాబట్టి.. రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఆయన ఆరోపించారు.. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టినా గులాబీ పార్టీ నుంచి పోటీలో ఉన్నవారు మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తారని హరీష్ రావు స్పష్టం చేశారు. అంతేకాదు రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
“అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు. మరో రెండు సంవత్సరాలు పోతే అధికారంలోకి వచ్చేది మేమే. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి అన్ని లెక్కలు చెబుతాం. వడ్డీతో సహా చెల్లిస్తాం. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ మాకు గుర్తే ఉంటున్నాయి. కచ్చితంగా బదులు ఉంటుంది. అది అంతకుమించిన స్థాయిలో ఉంటుందని” హరీష్ రావు హెచ్చరించారు.
అటు హరీష్ రావు.. ఇటు కేటీఆర్ రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం మునిసిపల్ ఎన్నికలలో హీట్ ను పెంచింది. తద్వారా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. గులాబీ పార్టీ నేతలు ఏ స్థాయిలో విమర్శలు చేసినప్పటికీ.. రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీకి మించిన స్థానాలను తాము గెలుచుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతుండడం విశేషం.
ఇక్కడున్నది హరీష్ రావు.. అందుకే రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా వచ్చేందుకు భయపడుతున్నాడు. pic.twitter.com/atMrm04vVS
— Telugu360 (@Telugu360) February 9, 2026