HomeతెలంగాణKCR : కేసీఆర్ ఎక్కడ? బీఆర్ఎస్‌లో మిస్ అవుతున్న మార్క్

KCR : కేసీఆర్ ఎక్కడ? బీఆర్ఎస్‌లో మిస్ అవుతున్న మార్క్

KCR :  దశాబ్దకాలం పాటు తనకంటూ తిరుగులేని నేతగా కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను శాసించాడు. గులాబీ పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి ఆయనే అధినేతగా కొనసాగుతూ వస్తు్న్నారు. ఓవరాల్‌గా పార్టీకి బాస్‌ ఆయనే. ఉద్యమ కాలం నుంచి పార్టీకి ఏ స్థాయిలో ఊపు తీసుకురావాలో ఆ స్థాయిలో తీసుకొచ్చాడు కేసీఆర్. పార్టీని తన భుజాలపై మోసి రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చాడు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు. ఒకవిధంగా రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర చూపించారు. దేశ రాజకీయాల్లోకి వెళ్లి యాక్టివ్ కావాలని కలలు కన్నప్పటికీ అది నెరవేరలేదు.

అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరింది. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. దాంతో గత పది నెలలుగా కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదు. కేవలం ఫాంహౌజ్ నుంచే నేతలను కలుస్తూ వారికి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై నిత్యం తెలుసుకుంటూ ఉన్నారు. ప్రజాసమస్యలపై పోరాడాలని, కాంగ్రెస్ వైఫల్యాలను నిలదీయాలని వారికి సూచనలు చేస్తూనే ఉన్నారు. అయితే.. గత పది నెలలుగా ఆయన ఎప్పుడెప్పుడా ప్రజల్లోకి వస్తారా అని చూస్తున్నారు. కానీ.. ఆయన నుంచి మాత్రం ఎలాంటి స్టేట్‌మెంట్లు రావడంలేదు. కనీసం వరదల సమయంలోనూ ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు.. హైడ్రా, గ్రూప్1 వివాదాలు నడుస్తున్నా హరీశ్, కేటీఆర్ పోరాడుతున్నారే తప్పితే కేసీఆర్ ఎలాంటి భరోసా కల్పించలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో మూసీపైనే రాజకీయం కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా సీఎం రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఎవరికి వారుగా మూసీ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో మూసీపై కేటీఆర్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే.. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన వారంతా ఒకింత ఆశ్చర్యపోయారు. ఆ స్క్రీన్‌లో బీఆర్ఎస్ లోగో, కేటీఆర్ ఫొటో తప్పితే కేసీఆర్ ఫొటో ఎక్కడా కనిపించలేదు. దీంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో పార్టీని పూర్తిగా కేటీఆర్ లాగేసుకున్నారన్న టాక్ నడిచింది. అటు తెలంగాణ భవన్‌లోనూ బీఆర్ఎస్ లోగోలో కేసీఆర్ ఫొటో కనిపించేది. కానీ.. కేటీఆర్ పిక్ మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడు కేటీఆర్ కూడా తన స్పీచుల్లో ఎక్కడా కేసీఆర్ ప్రస్తావన తీసుకురావడంలేదు. ఎక్కడా ఆయన అనవాళ్లు కూడా కనిపించడంలేదు. ఈ క్రమంలోనే కేసీఆర్ పూర్తిగా రాజకీయాలకు విరామం ప్రకటించారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అదే అనుమానం కలగక మానదు. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు మాత్రం త్వరలో కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారంటూ ప్రచారాలు సాగిస్తున్నారు. హైడ్రా అంశంపై వచ్చి మాట్లాడుతారని చెప్పుకొచ్చారు. కానీ కేసీఆర్ రాలేదు. ఇక దసరా ముహూర్తం అంటూ ప్రచారం చేశారు. ఆ దసరా కూడా అయిపోయింది. కానీ కేసీఆర్ నుంచి మాత్రం ఎలాంటి స్టేట్ మెంట్ లేదు. ఇప్పుడు తాజాగా డిసెంబర్‌లో వస్తారంటూ చెబుతున్నారు. డిసెంబరు నెలతో కాంగ్రెస్ పాలన యాడాది పూర్తి కానున్న నేపథ్యంలో పాలనపై నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు సిద్ధం అవుతున్నారన్న లీకులు ఇస్తున్నారు. కానీ.. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం కేసీఆర్ ఇక పార్టీలో యాక్టివ్ రోల్‌లోకి రాకపోవచ్చన్న అనుమానాలు వస్తున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version