Kaleshwaram
Kaleshwaram: ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంను ప్రమోట్ చేసుకుంది. డిస్కవరీ చానెల్లో సైతం పెయిడ్ ఆర్టికల్ ప్రసారం చేసుకుంది. 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన అంశాల్లో కాళేశ్వరం ఒకటి. కానీ, ఇదే కాళేశ్వరం 2023లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలను గల్లంతు చేసింది. ఎన్నికలకు నెల రోజుల ముందు ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేసి పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో బీఆర్ఎస్ పతనానికి ఇక్కడే నాంది పడింది. లక్ష కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు నీరందిస్తున్నామని అప్పటి వరకు ప్రచారం చేసుకున్న గులాబీ పార్టీ.. మేడిగడ్డ కుంగిన తర్వాత స్పందించిన తీరు తెలంగాణ ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దశాబ్దాలపాటు సురక్షితంగా ఉండాల్సిన ప్రాజెక్టులో చిన్నచిన్న లోపాలు ఉండడం కామన్ అంటూ నాటి ముఖ్యమైన మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇల్లు చిన్న ఇంటి నిర్మాణంతో లక్ష కోట్ల రూపాలయ ప్రాజెక్టును పోల్చడం ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేసింది.
ప్రతిపక్షాలకు ఆయుధంగా..
తెలంగాణలో బీఆర్ఎస్ పాలనై అప్పటికే తీవ్ర వ్యతిరేకతతో ఉన్న తెలంగాణ ప్రజల్లో ఆ వ్యతిరేకతను మరింత పెంచేలా మేడిగడ్డ రూపంలో విపక్షాలకు ఆయుధం దొరికింది. ప్రాజెక్టు కుంగుబాటునే విపక్ష కాంగ్రెస్, బీజేపీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. బీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రాజెక్టుపై కుంగుబాటుపై రంగంలోని దిగిన ప్రాజెక్టు నిర్వహణ అథారిటీ నిర్మాణ, డిజైనింగ్ లోపమే కారణమని నివేదిక ఇచ్చింది. ఇది విపక్షాల ఆరోపణలకు మరింత ఊతమిచ్చింది. సోషల్ మీడియాలోనూ విపక్షాలు మేడిగడ్డ కుంటుబాటును బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వైరల్ చేశాయి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కాంగ్రెస్, సీబీఐ విచారణ జరపాలని బీజేపీ ఒత్తిడి తీసుకువచ్చాయి. తాము అధికారంలోకి వస్తే.. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని టీపీపీసీ చీఫ్గా రేవంత్రెడ్డి ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే సీబీఐతో విచారణ జరిపి బ్యాధులపై చర్య తీసుకుంటామని బీజేపీ ప్రకటించింది.
అధికారంలోకి వచ్చాక కూడా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు చెప్పినట్లు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తుందని అంతా భావించారు. ఈమేరకు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన కూడా చేశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం అక్రమాలపై విచారణ కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేసింది. సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా గత ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. కానీ, ఇటు కాంగ్రెస్ చెప్పినట్టుగా సిట్టింగ్ జడ్జితోగానీ, అటు బీజేపీ డిమాండ్ చేసినట్లు సీబీఐతోగానీ విచారణ జరుపలేదు. అనూహ్యంగా కాంగ్రెస్ సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
రికార్డుల స్వాధీనం..
సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు.. ఏకకాలంలో భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని ఇరిగేషన్ కార్యాలయాలపై దాడులు చేశారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులకు సబంధించిన రికార్డుల కోసం తనిఖీలు చేశారు. చాలా వరకు రికార్డులు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 9వతేదీ రాత్రి వరకూ తనిఖీలు కొనసాగాయి. 10వ తేదీన కూడా తనిఖీలు నిర్వహిస్తామని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. కేవలం రికార్డులు మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నామని, వాటిని ప్రభుత్వానికి అందజేసి తర్వాత చర్యలు చేపడతామని తెలిపారు. దీంతో సిట్టింగ్ జడ్జి, సీబీఐ విచారణ కాకుండా విజిలెన్స్తోనే విచారణ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.