HomeతెలంగాణKavitha Party wins: తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో బోణి చేసిన కల్వకుంట్ల కవిత పార్టీ

Kavitha Party wins: తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో బోణి చేసిన కల్వకుంట్ల కవిత పార్టీ

Kavitha Party wins: తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీగా సీట్లు వచ్చాయి. దీంతో ఆ పార్టీలో ఆనందం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా విజయాలు సాధించుకుంటూ వస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా ఆ పార్టీకి అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల ఫలితాలలో గులాబీ పార్టీ కూడా పర్వాలేదు అనే స్థాయిలో స్థానాలను సాధిస్తోంది. ఈ క్రమంలో గత ఏడాది గులాబీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కల్వకుంట్ల కవిత ఈ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ తెలంగాణ జాగృతి కైవసం చేసుకుంది. తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఏఐఎఫ్ బీ తరఫున సింహం గుర్తుపై పోటీ చేశారు. 10 వార్డులకు గాను 8 వార్డులలో విజయం సాధించారు. తద్వారా వడ్డేపల్లి మున్సిపాలిటీ తెలంగాణ జాగృతి సొంతం చేసుకున్నట్టయింది.

ఇటీవల కాలంలో కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రయాణాన్ని ఒంటరిగా మొదలుపెట్టారు. తెలంగాణ జాగృతిని బలోపేతం చేశారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి యాత్ర కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే 10 సంవత్సరాలపాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మీద.. ప్రస్తుతం పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రేపటి నాడు సరికొత్త నాయకులుగా ఎదగాలని చాలామందికి శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు.

గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని గెలుచుకున్న నేపథ్యంలో కల్వకుంట్ల కవిత బృందంలోని నాయకులకు కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే ఇంతవరకు కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోలేదు. పార్టీని కూడా ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ ఆమె ఆధ్వర్యంలోని నాయకులు ఏకంగా 10 వార్డులు గెలవడం.. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలో మున్సిపాలిటీని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. దీంతో జాగృతి కార్యాలయం ఎదుట కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. బాణాసంచా కాల్చి.. 2028 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని చెబుతున్నారు.

మరోవైపు వడ్డేపల్లి మున్సిపాలిటీ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నాయకుల విజయం సాధించిన నేపథ్యంలో గులాబీ పార్టీ భాష్యం చెప్పడం మొదలుపెట్టింది. వారంతా కూడా గులాబీ పార్టీ కార్యకర్తలని.. ఈ విజయం మొత్తం గులాబీ పార్టీకి సొంతమవుతోందని చెబుతోంది. గులాబీ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారానికి జాగృతి కార్యకర్తలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version