KCR: సంతోష్‌ను గిల్లడమే.. చావుకొచ్చిందా.. బీఆర్‌ఎస్‌ పతనం కేసీఆర్‌ స్వయంకృతాపరాధమే!

అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడినా మంచిదే కానీ, బీఆర్‌ఎస్‌ గెలవ కూడదు అన్న లక్ష్యంతో బీజేపీ అధిష్టానం పనిచేసింది. బండి సంజయ్‌ నేతృత్వంలో ఆ పార్టీ ఎన్నికలకు వెల్లి ఉంటే.. గెలుపు ఖాయమయ్యేది.

Written By: Raj Shekar, Updated On : June 1, 2024 3:13 pm

KCR

Follow us on

KCR: తెలంగాణ ఉద్యమ పార్టీ.. తెలంగాణ సాధన కోసమే ఆవిర్భవించిన పార్టీ. ఎవరు అవునన్నా.. కాదన్న బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేకపోతే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. ఇందుకు గత చరిత్రే నిదర్శనం. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యమ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. 2014లో బీఆర్‌ఎస్‌ను గెలిపించారు. పార్టీ అధినేత, తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేశారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లినా.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీనే అధికారంలో ఉండాలని భావించారు. మరోమారు కేసీఆర్‌కు పట్టం కట్టారు. అయితే, రెండు పర్యాయాలు ప్రజలు ఇచ్చిన అధికారంతో కేసీఆర్‌ కుటుంబానికి అహంకారం తలకెక్కింది. ఎంతలా అంటే.. పదవి ఇచ్చిన ప్రజలనే శాసించే స్థాయికి.. తామే ఏం చేసినా చెల్లుతుంది.. తెలంగాణ ప్రజలు తాము ఏం చెప్పినా వింటారు అనేలా పరిస్థితి తయారైంది. ఈ అహంకారతోనే కేసీఆర్‌ గత మూడేళ్లుగా విర్రవీగారు. ముఖ్యమంత్రి పదవి దాటి ప్రధాని పీఠంపై కన్నేసే స్థాయికి పెరిగింది. ఈ క్రమంలోనే ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చేలా చేసింది. పార్టీలో మార్పులు, ప్రభుత్వంలో నిర్ణయాలన్నీ ఏకపక్షమే.

గిచ్చి కయ్యం పెట్టుకుని..
ఇక పెరిగిన సంపద, పదవులు, అహంకారంతో కేసీఆర్‌కు ప్రధాని పదవిపై ఆశ పుట్టింది. దీని కోసం పార్టీ పేరునే మార్చేశారు. ఇదే క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తన దారికి తెచ్చెకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మోదీతో గిచ్చి కయ్యాం పెట్టుకున్నారు. ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్‌ సంతోష్‌ను జైల్లో పెట్టేందుకు వ్యూహరచరన చేశారు. బీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న విషయం తెలుసుకుని వారి ఫోన్లు ట్యాప్‌ చేసి బీఎల్‌.సంతోష్‌ను జైల్లో పెట్టేందుకు దుస్సాహసానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టు అయిన రాధాకిషన్‌రావే స్వయంగా తన వాగ్మూలంలో వెల్లడించారు.

దాని ఫలితమే ఇదంతా..
కేసీఆర్‌ ఈ దుస్సాహసానికి కారణం కూడా ఉంది. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో కేసీఆర్‌ కూతురు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఆమె అరెస్టు కాకుండా ఉండేందుకు, అందే సమయంలో కేంద్రంలో బీజేపీని దెబ్బతీసేందుకు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా తెలంగాణ పోలీసులతో బీజేపీ నేత అరెస్టుకు ప్లాన్‌ చేశారు. ఈమేరకు తెలంగాణ పోలీసులను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి కూడా పంపించారు. కోర్టు స్టేతో అరెస్ట్‌ ఆగింది. తర్వాత బీజేపీ గేమ్‌ స్టార్ట్‌ చేసింది. దీంతో కవిత జైలుకు వెళ్లడంతోపాటు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమైంది. ఇప్పుడు పార్టీ సంక్షోభం ఎదుర్కొంటుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్‌ అడ్రస్‌ గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీనికంతటికీ కారణం.. కేసీఆర్‌ బీజేపీ నేత బీఎల్‌. సంతోష్‌ను అరెస్ట్‌ చేయాలని చూడడమే.

బీఆర్‌ఎస్‌ను ఓడాలని..
అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడినా మంచిదే కానీ, బీఆర్‌ఎస్‌ గెలవ కూడదు అన్న లక్ష్యంతో బీజేపీ అధిష్టానం పనిచేసింది. బండి సంజయ్‌ నేతృత్వంలో ఆ పార్టీ ఎన్నికలకు వెల్లి ఉంటే.. గెలుపు ఖాయమయ్యేది. కానీ, ఎక్కడో అనుమానం ఉండడంతో తాము ఓడినా మంచిదే కానీ బీఆర్‌ఎస్‌ గెలవ కూడదన్న లక్ష్యంతో బీజేపీ పనిచేసింది. ఇదే కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. బీఆర్‌ఎస్‌ను గద్దె దించింది. బీజేపీ గట్టిగా పోరాడితే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయని గులాబీ బాస్‌ భావించారు. హంగ్‌ ప్రభుత్వ ఏర్పడుతుందని, కాంగ్రెస్‌తో కలిసి సర్కార్‌ ఏర్పాటు చేయవచ్చని లెక్కలు వేసుకున్నారు. కానీ, అది ఫలించకుండా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. కిషన్‌రెడ్డిని తెలంగాణ అధ్యక్షుడిని చేయడం ద్వారా రేసు నుంచి తప్పుకున్నట్లు సంకేతాలు ఇచ్చింది. దీంతో తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపారు. తర్వాత కవితను తిహార్‌ జైలుకు పంపింది. తమ జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కేసీఆర్‌కు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌ అసలు పరీక్ష ఎదుర్కొనాల్సి ఉంటుంది.